Wednesday, May 21, 2025

అనంత భాస్కర శతకముపై నా సమీక్ష. శతక కర్త... శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ

 అభినందన మందారం


ఓం శ్రీమాత్రే నమః.


'శ్రీ అనంత భాస్కర శతక' కర్త శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ గారు 

వ్బాగ్విదాంవర బిరుదాంచితులు. ఇంతకు ముందు వీరు 

గురుసహస్ర నామావళిని168 శ్లోకములతోరచించారు.  

"లలిత పదముల మది లలిత గొలుతు" అనే మకుటముతో లలితా శతకము, 

"వరసిద్ధి వినాయక భక్త పాలకా" అనే మకుటముతో వినాయకునిపై శతకము రచించారు. 


ఆంధ్రామృతము అనే నా బ్లాగులో ప్రచురింపఁబడి వీరి శతకాలు ఎందరెందరో  

పాఠకుల మన్ననలందుకొన్నాయి. 

వీరు పద్య రచనలో చేయితిరిగిన కవి. ఐహికమగు రచనా వ్యాసంగముతో 

ఆముష్మికమును సాధించుటకు వీరు చేయుచున్న ప్రయత్నము వీరి రచనలో 

గోచరింస్తుంది. 

ఐహిక వాంఛలకు దూరులై, పరమాత్మతో తాదాత్మ్యము పొందుతూ పరమాత్మకు వీరు 

చేసుకొనుచున్న విన్నపము ప్రత్యక్షర సత్యమై శతక బద్ధమైయున్నది.

శ్లో: ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ 

అని ఆర్యోక్తి. ఇందలి మర్మము గ్రహించిన మన అనంత కృష్ణ గారు కూడా తనకు గల 

అపార కవితా ప్రాభవముతో అనంతభాస్కరశతకరచన చేసిరి. ఇది సామాన్యమయిన 

రచనగా భావిస్తే మనం పొరబడినట్టే. 

చిత్ర, బంధ, నామ గోపనాది చిత్ర కవితా వైచిత్రీ ప్రాభవముతో శతకము మొత్తము 

వ్రాయుటకు సమర్ధులైయుండి కూడా, భక్తి భావనాభరితమగు సీసములను వ్రాస్తూ 

అటనట కొన్ని పద్యములలో తనకు గల చిత్ర కవితా వైచిత్రిని ప్రదర్శించి, 

భక్తుల మనములతోఁ బాటు చిత్ర కవితానురక్తులగు మహా కవులు హృదయములను 

సహితము చూఱగొన్నారు. 

శ్రీ కారముతో నారంభించిన యీ సీసములకు సీసాంతమునుండు తేట గీతిలో 

చివరి రెండు పాదములందు 

భాస్కరాదిత్య ! ఘృణి సంజ్ఞ! భక్త వరద! దివసకర! వరేణ్య ! సవితా! తిగ్మ కిరణ!

అనే మకుటమునుంచిరి.

ఈ మకుటమునందు ఆ సూర్య భగవానుని నామములు తప్ప మరొకటి లేకుండుట 

గమనించినచో ఈ కవికి గల భక్తి తత్పరత వ్యక్తము కాక మానదు. 


ఈ లోకము యొక్క సృష్టి, స్థితి, లయలకు మూలము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాగా 

ఆ మూడు మూర్తులూ ప్రత్యక్ష సాక్షి సూర్యభగవానుఁడే .

ఉదయం బ్రహ్మ స్వరూపం, మధ్యాహ్నంచ మహేశ్వరమ్ 

సాయంకాలే సదావిష్ణుం, త్రిమూర్తించ దివాకరః.

ఈ ఆర్యోక్తిని మనకవి 2వ పద్యములో  సోదాహరణముగా వివరించి, 

2వ పస్యంలో "మూడు మూర్తులు నీవైన మూల పురుష 

నిజమునెఱుగంగ మనసార నిన్ను కొలుతు" 

అని తెలిపి యున్నారు. 

103 వ పద్యమున సూర్యోపాసన ఎంతసుకరమో వివరించారు.



కవిగా తాను తరించుటయే కాక, 

8వ, 13వ, 49 వ పద్యములలో

తన పుత్ర పౌత్రాది భక్త బాంధవాది జనుల 

నామములను పద్యములలో ఉంచి పరమాత్మతో సీసములలో ముచ్చటించుట చూచినచో 

ఎట్టివారికైనా ఆశ్చర్యం కలుగక మానదు. 

 “సరోజ శర్మ - అనంత - వనజ - కౌశిక్ - శృతి కీర్తి - అపర్ణ 

- రఘురామ మూర్తి - కుమారి పాండు గీత భరద్వాజ కశ్యప - హాసిని - సహస్ర కౌముది ' 

మున్నుగా కల వారి బంధువుల నామములు మనము గమనించ వచ్చును. 


వీరు రచించిన సాధారణమగు సీసములలో అసాధారణ మగు 

ఘృణి, సూర్య, ఆదిత్య, ఓం, అనే పదముల సమాహారము "మూల శక్తి" గా కనపడును. 

6 వ పద్యము దీనికి నిదర్శనము. 


ఈ కవి గర్భ కవిత వ్రాయుటలో నిపుణుఁడు దానికి ఈ క్రింది 14వ పద్యమే తార్కాణము. 

గమనింపుడు.

14  సీ: మాయను జిక్కుట మది నూహ జేయగా రా//నిది తగులగ రాదనంచు

వారింప శక్యమే, వాక్కున పల్కుటె టులనిశ్చల గతులన్ గలుగుటెటుల,

దాయక తెల్పుము తదుపాసనా సుసా  ధ్య//మ్మది చెందగ నెమ్మది గొన

నీయనుకంపయౌ నిర్గుణ సత్యము  తృటినందెడి విధమున్ తెలియనెంతు

గీ: ఆటుపోటులఁ జిక్కక నటునిటులన్ బారక గమనమాగని బాట జూపు,

భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద - దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ. 

ఈ 14వ పద్యమును పఠించునెడ మనకు సీసముగనే తోచును కాని ఇందు ఒక

కంద పద్యము గర్భితమై యున్నదను విషయము చెప్పిన గాని తెలియదు. 

ఇందలి కంద పద్యమును గమనింపుడు.

క.  మది నూహ జేయగారా

నిది వాక్కున పల్కుటెటుల, నిశ్చల గతులన్ 

తదుపాసనా సుసాధ్య

మ్మది నిర్గుణ సత్యము తృటినందెడి విధమున్.

పద్య రచనమున పారమంటిన కవులు చేయు ప్రక్రియ చిత్ర కవిత యని 

సాహితీ వేత్తల భావన. 


ఈ చిత్రకవితలలో  అక్షర నియమమును బట్టి

(1)ఏకాక్షర చిత్రము - (2) ద్వ్యక్షర చిత్రము - 

(3)త్యక్షర చిత్రము - (4) చతురక్షర చిత్రము అను 

నాల్గు ప్రక్రియలను మన కవి 85 వ పద్యంలో నాలుగు పాదములలో 

చూపియున్నారు.

85. సీ: నేను నే నను నేను నేనని నే ననన్ - నేనన్న నేనన్న నిన్ను నిన్నె(1) 

నా మనమన్న నీ నామ మ్మని నమ్ము - నీ నామ మన నమ్ము నెమ్మి నిమ్ము (2) 

సుమ సమానము మానసమనుమానము మాని - నా మనో సుమమాసన మనుమన్న(3) 

నీ యెద దాగని నీ దయ నేగొందు నాయందు నాదగు నయ్యది నాదె యందు (4) 

గీ: వేనవేల మాటలవేల వేడికొందు - నెల్ల వేళల నుండు నా యుల్లమందు

భాస్కరాదిత్య! ఘృణి సంజ్ఞ భక్త వరద! - దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ.  


చిత్ర బంధ రచనా దక్షులయిన మన కవి 

100 వ పద్యముగా రథ బంధ సీసమును రచించెను. అందు కవి నామము గ్రంథ నామము 

నిక్షేపించుటను వీరికి గల చిత్ర కవితా పాటవమునకు ఉదాహరణగా చెప్ప వచ్చును.

ఆ రథ బంధం గమనింపుడు.

సీ: అవునంతియే  అనే 100 వపద్యంలో మధ్య నిలువు 

" అనంత కృష్ణ భాస్కర శతకము" 

అని  భావగోపనచిత్ర రథబంధనిర్మాణము మిక్కిలి క్లిష్టతరమైనదయ్యు 

అనంతుని చేతిలో అలవోకగా ఒదిగిపోయెను.


అనంతుఁడగు ఆ దినకరుఁడే అనంతుఁడయ్యెనో యేమో గాని, అనంత కృష్ణ కవి మాటల 

మేళనమునందు కూడా దినకర మంత్రమునే ప్రభవింప జేసినారు. 

ఈ కవి కవితా భేషజము ఈ క్రింది పద్యము వలన తెల్లమగుచున్నది. 

దారిద్య్ర దుఃఖాలు దరిదాపులకు రావు అని భరోసా యిచ్చుచూ, 

అందులకు ఏమి చేయ వలెనో 

ఈ క్రింది 79వ పద్యమున వివరించిరి. 



శ్రీమదనంత కృష్ణ కవి ఈ అనంత భాస్కర శతకమును ఆ సూర్య భగవానునకే 

త్రికరణ శుద్ధిగా అంకితము చేయుచూ 102 వ పద్యమున ఆ పరమాత్మను గైకొమ్మని 

అంకితమిచ్చి కృతకృత్యులైరని చెప్ప వచ్చును.


ఇంత చక్కని శతకమును లోకమునకందించిన  శ్రీఅనంత కృష్ణ కవివరుని 

మనసారా అభినందించుచున్నాను. 


సప్త వింశత్యధిక ద్వివిధ కంద - గీత గర్భ చంపకమాల:-


ఘృణి ధరుఁడై సదా! కవికి శ్రీకరముల్ రవి కాంచ చేయగా 

మునివరుఁడై మదిన్ నిరతమున్ వరభాస్కరునే గణించె. భా 

వన వరుఁడే కదా!  అమృత భాస్కర తేజుఁడనంత కృష్ణ సా 

ధన గురుఁడై భువిన్ హరి సుధార్త రమాన్వితుడై సుఖించుతన్.


మంగళప్రదుఁడగు ఆ సూర్య భగవానుఁడే ఈ కవికి నిత్యము 

సర్వమంగళ కారకుఁడగును గాక. 

స్వస్తి.

Friday, May 2, 2025

సౌందర్య లహరి 96-100 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

96 వ శ్లోకము.  
కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః ||
పదచ్ఛేదము.
కళత్రమ్ -  వైధాత్రమ్ -  కతి - కతి - భజంతే - న-  కవయః -
శ్రియః -  దేవ్యాః - కః -  వా - న - భవతి - పతిః - కైః -  అపి - ధనైః -
మహాదేవమ్ -  హిత్వా  - తవ - సతి - సతీనామ్- అచరమే -
కుచాభ్యామ్ -  ఆసంగః - కురవక - తరోః - అపి -  అసులభః.
అన్వయక్రమము.
సతి, వైధాత్రమ్, కళత్రమ్, కతికతి, కవయః, న భజంతే, శ్రియః దేవ్యా, కైః అపి ధనైః, కోవా, పతిః, నభవతి, సతీనాం అచరమే, మహాదేవమ్, హిత్వా, తవ, కుచాభ్యామ్, ఆసంగః, కురవక తరోః అపి, అసులభః.
పద్యము.
సీ.  బ్రహ్మరాజ్ఞిని గొల్చి భవ్య సత్ కవులయి వాణీ పతులటంచుఁ బరగువారు,
శ్రీలక్ష్మినే గొల్చి శ్రీదేవి కృపచేత ధనికులై పేరొంది ధనపతులుగ
వెలుఁగువారు కలరు, విశ్వేశుఁడొక్కఁడే పార్వతీపతియని ప్రబలు ధాత్రి,
పతిని వీడక నిత్యమతనినే యెదనిల్పి పరవశించెడి నిన్ను బడయనేర
తే.గీ.  దవని కురవకమయిననో యమ్మ! నీదు
నెదను పులకించు భాగ్యము నిందువదన!
నీదుపతిఁగూడి యున్న నిన్ నాదు మదిని 
నిలిపి పులకింపనిమ్మిలన్ నిత్యముగను! ॥ 96 ॥
ప్రతిపదార్థము. 
సతి = ఓ పార్వతీ, 
వైధాత్రమ్ = విధాతకు సంబంధించినదైన, 
కళత్రమ్ = భార్య అయిన సరస్వతిని, 
కతికతి = ఎందరెందఱు, 
కవయః = కవులు, 
న భజంతే = సేవించుట లేదు?(సేవించుచుండిరి), 
శ్రియః దేవ్యా = లక్ష్మిదేవి యొక్క, 
కైః అపి ధనైః = ఏదో కొంత ధనము చేత , 
కోవా = ఏ పురుషుడు, 
పతిః = ధనపతి, 
నభవతి = కాకున్నాడు?(ధనపతి అగుచున్నాఁడు)
సతీనామ్ అచరమే = పతివ్రతలలో అగ్రగణ్యమైన దేవీ! 
మహాదేవమ్ = సదాశివుని, 
హిత్వా = వీడి, 
తవ = నీ యొక్క, 
కుచాభ్యామ్ = స్తనయుగము చేతనైన, 
ఆసంగః = కౌగిలింత, 
కురవక తరోః అపి = గోరంట చెట్టునకు సైతము, 
అసులభః = సులభము కాదు. 
భావము. 
ఓ పతివ్రతా శిరోమణీ! పార్వతీ! బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరెందరు కవులు సేవింపకున్నారు? లక్ష్మీదేవి యొక్క ధనసంపదలను పొంది ఏ పురుషుడు ధనపతి కాకున్నాడు? కాని పతివ్రతలలో మొట్టమొదట లెక్కింపదగిన దేవీ! నీ స్తనయుగముతోడి కౌగిలింత ఆ సదాశివునికి ఒకనికే తప్ప గోరంట చెట్టుకు గూడా లభించదు కదా!

97 వ శ్లోకము.  
గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయామ్ |
తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ||
పదచ్ఛేదము.
గిరామ్ -  ఆహుః -  దేవీమ్ -  ద్రుహిణ - గృహిణీమ్ -  ఆగమ - విదః -
హరేః - పత్నీమ్ -  పద్మామ్ -  హర - సహచరీమ్ -  అద్రి - తనయామ్ -
తురీయా - కాపి - త్వమ్ -  దుర్ -  అధిగమ - నిస్సీమ - మహిమా -
మహా - మాయా - విశ్వమ్ -  భ్రమయసి - పరబ్రహ్మ - మహిషి.
అన్వయక్రమము.
పరబ్రహ్మమహిషి, ఆగమవిదః, త్వాం ఏవ, దృహిణ గృహిణీమ్, గిరాందేవి, ఆహుః, త్వాం ఏవ, హరేః, పత్నీమ్, పద్మామ్, ఆహుః, త్వమేవ, హరసహచరీమ్, అద్రితనయామ్, ఆహుః, త్వమ్, తురీయా, కాపి, దురధిగమ, నిస్సీమ, మహిమా, మహామాయా, విశ్వమ్, భ్రమయసి.
పద్యము.
శా.  నిన్నేబ్రహ్మకుఁ బత్నిగాఁ దలచుచున్ నిత్యంబు సేవింతు రా
నిన్నే విష్ణుని పత్నిగాఁ గొలుచుచున్ నేర్పార పూజింతు రా
నిన్నే శంభుని పత్నిగాఁ దలతురే నిత్యంబు వేదజ్ఞు లే
మన్నన్ వేరగు శక్తి వీ జగతి మోహభ్రాంతులన్ గొల్పుదే. ॥ 97 ॥
ప్రతిపదార్థము.  
పరబ్రహ్మ మహిషి = ఓ సదాశివుని పట్టమహిషీ , 
ఆగమ విదః = వేద రహస్యార్థములు తెలిసిన వారు, 
త్వాం ఏవ = నిన్నే, 
దృహిణ గృహిణీమ్ = బ్రహ్మ ఇల్లాలైన, 
గిరాందేవి = వాగ్దేవి అయిన సరస్వతినిగా, 
ఆహుః = వచింతురు, 
త్వాం ఏవ = నిన్నే, 
హరేః = విష్ణువు యొక్క, 
పత్నీమ్ = భార్య అయిన, 
పద్మామ్ = కమలవాసిని అయిన లక్ష్మీదేవిగా, 
ఆహుః = చెప్పుదురు, 
త్వమేవ = నిన్నే, 
హర సహచరీమ్ = శివుని సహధర్మచారిణి అయిన, 
అద్రితనయామ్ = పార్వతిగా, 
ఆహుః = చెప్పుదురు, 
త్వమ్ = నీవు, 
తురీయా = ఆ మువ్వురి కంటె నాల్గవ ఆమెయగు బ్రహ్మమై, 
కాపి = ఇట్టిదని చెప్పనలవి కాని, 
దురధిగమ = పొందనలవి కాని, 
నిస్సీమ = హద్దులేని, 
మహిమా = ప్రభావము కలదైన, 
మహామాయా = గొప్ప మాయాతత్త్వమగుచు, 
విశ్వమ్ = ఈ జగత్తును, 
భ్రమయసి = భ్రమింప చేయుచున్నావు. 
భావము. 
ఓ పరబ్రహ్మ పట్టపుదేవీ! ఆగమవిదులు నిన్నే బ్రహ్మ పత్నివైన సరస్వతి అంటారు. నిన్నే శ్రీహరి పత్ని లక్ష్మి అంటారు. నిన్నే హరుని సహచారిణి ఐన గిరితనయ అంటారు. కానీ నువ్వు ఈ మువ్వురి కంటే వేరై నాల్గవదేవియై ఇట్టిదట్టిదని వచింప నలవిగాని ఆమెవై అనిర్వాచ్యవై, దేశ కాల వస్తువులకు అపరిచ్ఛిన్నవై, భేదించరాని మహాప్రభావం కలిగినదానవై, శుద్ధవిద్యలో అంతర్గతమైన మహామాయవై, మాయాతత్త్వ మవుతూ ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా మోహ పెట్టుతున్నావు.

98 వ శ్లోకము.  
కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజన జలమ్ |
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
కదాధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతామ్ ||
పదచ్ఛేదము.
కదా - కాలే - మాతః - కథయ - కలితా - లక్తక - రసమ్ -
పిబేయమ్ -  విద్యార్థీ - తవ - చరణ - నిర్ణేజన - జలమ్ -
ప్రకృత్యా - మూకానామ్ -  అపి -  చ - కవితా - కారణతయా -
కదా - ధత్తే - వాణీ - ముఖ - కమల-  తాంబూల - రసతామ్.
అన్వయక్రమము.
మాతః, కలిత + అలక్తక రసమ్, తవ, చరణ నిర్ణేజన జలమ్, విద్యార్థీ, అహమ్, కదాకాలే, పిబేయమ్, తచ్చ, ప్రకృత్యా, మూకానామ్ అపి, కవితా కారణతయా, వాణీ, ముఖ కమలమ్, తాంబూల రసతామ్‌, కదా, ధత్తే, కథయ.
పద్యము.
శా.  శ్రీలన్ జిందు కవిత్వమొందగను నిన్ సేవించు విద్యార్థినే,
నీ లాక్షారస యుక్త పాదజలమున్ నే గ్రోలగానెప్పుడౌన్?
జాలున్ మూకకుఁ బల్కుశక్తినిడుచున్ సద్గీతమల్లింప నా
మేలౌ శారద వీటిఁ బోలు రయి భూమిన్ నాకదెట్లబ్బునో? ॥ 98 ॥ 
(రయి = నీరు)
ప్రతిపదార్థము. 
మాతః = ఓ తల్లీ ,
కలిత + అలక్తక రసమ్ = లత్తుకరసము గలదైన, 
తవ = నీ యొక్క, 
చరణ నిర్ణేజన జలమ్ = పాదములు కడిగిన ఉదకమును, 
విద్యార్థీ = బ్రహ్మ విద్యనర్థించువాఁడనయిన, 
అహమ్ = నేను, 
కదాకాలే = ఎప్పుడు, 
పిబేయమ్ = త్రాగుదునో, 
తచ్చ = ఆ జలము, 
ప్రకృత్యా = స్వభావముచేతనే, 
మూకానామ్ అపి = మూగ వారలకు సహితము, 
కవితా కారణతయా = కవిత్వ రచన గావించుటకు కారణమైన దగుటచేత, 
వాణీ = సరస్వతి యొక్క, 
ముఖ కమలమ్ = ముఖ పద్మము నందలి, 
తాంబూల రసతామ్‌ = తాంబూల రసము సారస్యమును, 
కదా = ఎప్పుడు, 
ధత్తే = ధరించుచున్నదో. 
కథయ = చెప్పుము. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! స్వాభావికముగానే – చెవిటివారికి వినికిడి శక్తిని, మూగవారికి మాట్లాడుశక్తిని కలిగించునదై, పూర్వానుభవము, సామర్థ్యము లేకున్నా కవిత్వరచనా సౌభాగ్యమును ప్రసాదించునదై, సరస్వతీదేవి తాంబూల రసము వంటిదగు లత్తుకరసముతో కలసిన నీ పాద ప్రక్షాళన జలమును-  విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలుదునో చెప్పుము. 

99 వ శ్లోకము.  
సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా |
చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ ||
పదచ్ఛేదము.
సరస్వత్యా - లక్ష్మ్యా  - విధి - హరి - సపత్నః -  విహరతే -
రతేః - పాతివ్రత్యమ్ -  శిథిలయతి - రమ్యేణ - వపుషా -
చిరమ్ -  జీవన్ -  ఏవ - క్షపిత - పశు - పాశ - వ్యతికరః -
పర -  ఆనంద -  అభిఖ్యం -  రసయతి - రసమ్ -   త్వత్ -  భజనవాన్.
అన్వయక్రమము.
త్వత్‌ + భజనవాన్‌, సరస్వత్యా, లక్ష్మ్యా, విధి హరి, సపత్నః, విహరతే, రమ్యేణ, వపుషా, రతేః, పాతివ్రత్యమ్, శిధిలయతి, చిరమ్, జీవన్నేవ, క్షపిత, పశు, వ్యతికరః, పరానంద + అభిఖ్యమ్, రసమ్, రసయతి.
పద్యము.
మ.  నిను సేవించెడివాఁడు దివ్య ధనుఁడై, నిష్ణాతుఁడై విద్యలన్,
ఘనుఁడౌ బ్రహ్మకుఁ, బద్మగర్భునకుఁ, గాక న్నీర్ష్యచేఁ గొల్పుఁ , దాఁ
దనువున్ దీప్తిని గల్గి యా రతి పునీతన్ మార్చు, నిస్సారమౌ
తనువున్ వీడి ప్రశస్త ముక్తిని గొనున్ దా సాంబునే దల్చుచున్. ॥ 99 ॥
ప్రతిపదార్థము. 
(జగజ్జననీ! = ఓ లోకమాతా!)
త్వత్‌ + భజనవాన్‌ = నిన్నుసేవించు భక్తుడు, 
సరస్వత్యా = వాగ్దేవి తోడను, 
లక్ష్మ్యా = లక్ష్మీదేవితోడను గూడిన, 
విధి హరి = వరుసగా బ్రహ్మకు విష్ణువునకును, 
సపత్నః  = పోటీదారుఁడగుచు, 
విహరతే = విహరించుచున్నవాఁడై, 
రమ్యేణ = అతిసుందరమైన, 
వపుషా = శరీరము చేత, 
రతేః = రతీదేవి యొక్క, 
పాతివ్రత్యమ్ = పతివ్రతా ధర్మమును, 
శిధిలయతి = సడలింప జేయుచున్నవాడై, 
చిరమ్ = తడవుగా,
జీవన్నేవ = బ్రతికి యుండినవాఁడై,
క్షపిత = విదళింపబడిన, 
పశు = జీవుల యొక్కయు, అవిద్య యొక్కయు, 
వ్యతికరః = సంబంధము కలవాడై, 
పరానంద + అభిఖ్యమ్ = బ్రహ్మానందము అనఁబడు, 
రసమ్ = సుఖమును, 
రసయతి = ఆస్వాదించుచున్నాడు. 
భావము. 
అమ్మా ఓ భగవతీ ! నిన్ను ఉపాసించువారు , సరస్వతీ దేవినీ (సర్వవిద్యలను)లక్ష్మీదేవినీ(సర్వసంపదలను ) పొంది వాళ్ళభర్తలైన బ్రహ్మవిష్ణువులకు వైరిగా మారుతున్నారు . రమ్య శరీరంచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. పశుతుల్య శరీరాన్ని తొలగించుకొని, జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్త్వాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు. 

100 వ శ్లోకము.  
ప్రదీప జ్వాలాభిర్దివసకరనీరాజనవిధి
స్సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా |
స్వకీయైరంభోభిస్సలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్  ||
పదచ్ఛేదము.
ప్రదీప - జ్వాలాభిః -  దివస కర - నీరాజన - విధిః -
సుధాసూతేః -  చంద్ర -  ఉపల - జల - లవైః -  అర్ఘ్య - రచనా -
స్వకీయైః - అంభోభిః -  సలిల - నిధి - సౌహిత్య - కరణమ్ -
త్వదీయాభిః -  వాగ్భిః -  తవ - జనని - వాచామ్ -  స్తుతిః -  ఇయమ్.
అన్వయక్రమము.
వాచాం జనని, యథా, స్వకీయాభిః, ప్రదీప జ్వాలాభిః, దివస కర, నీరాజన విధిః, యథా, స్వకీయైః, చంద్ర + ఉపజల లవైః, సుధా సూతేః, అర్ఘ్య రచనా, యథా, స్వకీయైః, అంభోభిః, సలిల నిధి, సౌహిత్య కరణమ్, త్వదీయాభిః, వాగ్భిః, తవ, ఇయమ్, స్తుతిః, తథా.
పద్యము.
సీ.  నే చేతి దివిటీల నీరాజనంబును సూర్యదేవునికిచ్చుచొప్పు కనఁగ,
శశికాంతిశిలనుండి జాలువారెడి బిందు జలములనర్ఘ్యంబు శశికొసంగు
నట్లుదకంబులనర్ఘ్యంబు దధికిచ్చినట్టుల నీ నుండి యిట్టులేను
నిరుపమా! పొడమిన నిరుపమ వాగ్ఘరిన్ నిను నుతియించుచున్ నిలిచియుండి,
తే.గీ. ధన్య జీవుఁడనయితి  సౌందర్యలహరి
శంకరులు వ్రాయఁ దెలిఁగించి, శాశ్వతమగు
ముక్తి, సత్కీర్తి, నొసఁగెడి శక్తి! జనని!
యంకితము చేసితిని నీకు నందుకొనుము. ॥ 100 ॥
ప్రతిపదార్థము.
వాచాంజనని = వాక్ ప్రపంచమునకు తల్లీ, 
యథా = ఏ విధముగా, 
స్వకీయాభిః = తనకు సంబంధించినవే అయిన, 
ప్రదీపజ్వాలాభిః = చేతి దివిటీల యొక్క జ్వాలలచే, 
దివస కర = సూర్యునికి, 
నీరాజనవిధిః = కర్పూరహారతి నిచ్చుటయో, 
యథా = ఏ విధముగా, 
స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన, 
చంద్ర + ఉపజలలవైః = స్రవించు చంద్రకాంత శిలా జల బిందువులచేత, 
సుధాసూతేః = చంద్రునికి, 
అర్ఘ్య రచనా = అర్ఘ్యము సమర్శించుటయో, 
యథా = ఏ ప్రకారము, 
స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన, 
అంభోభిః = జలముల చేత, 
సలిల నిధి = సముద్రునకు, 
సౌహిత్య కరణమ్ = తృప్తికొఱకు తర్పణము చేయుటయో, 
త్వదీయాభిః = నీ వలన ఉత్పన్నములైన, 
వాగ్భిః = వాక్కుల చేత, 
తవ = నీకు, 
ఇయమ్ = ఈ , 
స్తుతిః = సోత్రము, 
తథా = ఆ ప్రకారము,  అగుచున్నది.
భావము. 
ఓ భగవతీ! స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలలచేత సూర్యుడికి ఆరతి గావిస్తూన్నట్లు చంద్రకాంత శిలనుండి స్రవిస్తూన్న జలబిందువులచేత చంద్రుడికి అర్ఘ్యము సమర్పిస్తూన్నట్లూ, ఉదకాలచే సముద్రుడికి తృప్తికారణమైన తర్పణం కావిస్తూన్నట్లూ , నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్తుతిస్తున్నాను.
*సౌందర్యలహరి స్తోత్రం సంపూర్ణమ్*
O2 . 11 . 2022 To 01 . 6 . 2023.
శా.  శ్రీమన్మంగళ శాంభవీజనని నా చిత్తంబులోఁ బ్రేరణన్
బ్రేమన్ గొల్పగఁ, దెల్గు పద్యములుగా విఖ్యాతిగా మార్చితిన్
సామోద్భాసిత మాతృ రూప విలసత్ సౌందర్య సద్వీచికన్,
శ్రీమన్మంజులభావపాఠకులకున్ శ్రేయంబు గూర్పన్ సదా.
ఫలశ్రుతి
శా.  శ్రీమన్మంగళ శాంభవీ! లలిత! హృచ్ఛ్రీచక్ర సంచారిణీ!
సామాన్యుల్ కన నే రచించిన కృతిన్ సౌందర్య సద్వీచికన్
క్షేమంబొందఁ బఠింపఁగాఁ దలతు రా చిన్మార్గులన్ బ్రోవుమా, 
నీ మంత్రాక్షరి పాఠకాళికిడుమా నిర్వాణ సంపత్ప్రభల్.
భావము.  శ్రీమన్మంగళస్వరూపిణివైన ఓ భవానీ! ఓ లలితా మాతా! హృదయమునందలి శ్రీచక్రమున సంచరించు జననీ!సామాన్యులు సహితము గ్రహించుటకు వీలుగా నేను రచించిన ఈ ఆంధ్ర సౌందర్యలహరిని, క్షేమము పొందుట కొఱకు చదువుచుండెడి తేజోమూర్తులైన భక్తులను కాపాడుచుండుము. నీకు సంబంధించిన యీ మంత్రాక్షరస్వరూపము నిర్వాణ సంపత్ప్రభలను పాఠకులకు ప్రసాదించుగాక.
నివేదన
శా. శ్రీమాతా! వరలోకపావని! సతీ! చింతాన్వయుండన్, భవత్
ప్రేమన్ గాంచెడి రామకృష్ణను, జగద్విఖ్యాత సౌందర్యమన్
ధీమచ్ఛంకర సత్ కృతిన్ లహరినే తెన్గించితిన్ శ్రీసతీ!
క్షేమంబున్ గలిగింప పాఠకులకున్ చిద్రూపిణీ! కావుమా.
భావము.  శ్రీమాతా! ఓ లోకపావనీ! సతీజననీ! నేను చింతా వంశసంభవుఁడను. నీ ప్రేమను పొందిన భాగ్యశాలినైన రామకృష్ణారావు నామధేయుఁడను. ధీమంతులైన శంకరభగవత్పాదులవారు రచించిన లోక ప్రసిద్ధమయిన సౌందర్యలహరిని పాఠకులకు క్షేమమును కలిగించు నిమిత్తము నేను నీ కృపతో తెలుఁగు పద్యములలోనికనువదించితిని. ఓ చిద్రూపిణీ! కాంచుము తల్లీ!
అంకితము.
ఉ. సాకల్యంబుగఁ దెల్గులో మలచితిన్ సౌందర్య సద్వీచికన్
నీకే యంకితమిత్తునమ్మ! కొనుమా! నీవే కృపన్ దీని, నో
శ్రీ కల్యాణి! భవాంబుధిన్ గడపుమా, చిత్తంబునందుండుమా,
నీకున్ మ్రొక్కెద భక్తితోడను భవానీ! సమ్మతిన్ గాంచుమా!
భావము.  ఓ భవానీమాతా! సౌందర్యలహరిని నేను క్షుణ్ణముగా పరిశీలించి తెలుఁగు పద్యమ్యులుగా మలచినాడను. ఓ కల్యాణీ! ఈ గ్రంథమును నీకే అంకితముగా సమర్పించుదును తల్లీ! నీవే కృపతో ఈ గ్రంథమును స్వీకరింపుమమ్మా! నన్ను భవాంబుధినుండి దాటించుము. నీవు నా హృదయములో ఉండుమమ్మా! నీకు భక్తితో నమస్కరింతును! నన్ను సమ్మతితో గాంచుమమ్మా!
ఓం శ్రీమాత్రే నమః

పండితాభిప్రాయములు.

అవధాన భారతి. సాహితీ చతురానన. ఛందో వైవిధ్యనిష్ణాత. ఛందస్సవ్యసాచి. స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. హైదరాబాద్. 92913 33880.

సంశబ్దనం.

పద్యరచనలోనెన్నెన్ని మార్గములున్నవో- అన్నింట తన ప్రతిభాపాండితీవైభవముతో నడిచి- తనతో బాటు మరికొందరిని నడిపించి- శ్రీ భారతీ పద పద్మారాధకులుగా నిలిచిన వారు శ్రీ చింతా రామకృష్ణారావుగారు.

వీరి చిత్తవీథి యందు నొక భావన మెరుపుతీగవలె మెరసిన వెంటనే దానినొక రసవత్తర కావ్యముగా రచించి- తెలుఁగువారికి నందించుట యనునది యొక దీక్షగా తలంచినటుల - వీరు వ్రాసిన కావ్య పరంపరల ద్వారా మనము తెలిసికొన వచ్చును. వీరి ప్రోత్సాహముతో మరికొందరు పద్య ప్రేమికులు పద్య రచయితలై వీరివలె గ్రంథములు రచించి భాషాసేవ చేయుచున్నారు. 

శ్రీ చింతావారి కలమునుండి జాలువారిన మరొక అద్భుత కావ్యము 'ఆంధ్రసౌందర్యలహరి." ఇది యనువాద కావ్యము. సాక్షాత్ శంకర స్వరూపమైన ఆదిశంకరాచార్య విరచితమగు' సౌందర్యలహరి" ని వీరు తెలుగున పద్యకావ్యముగా రచించుటయే కాక మూలశ్లోకములకు తెలుఁగు ప్రతిపదార్థమును భావమును వ్రాసి మనకునందించినారు.

ఒకరి కావ్యమను మరోకవి మరియొకభాషలో ననువదించుటకు - తదనువాద కవికి రెండు భాషలందు తగినంత పట్టుండవలయును, మూలకవి భావమును చక్కగా గ్రహించవలెను. ఉన్నదున్నట్టుగా భావ వ్యక్తీకరణ చేయవలయును. "కాళిదాసు కవిత్వము కొంత- నాకైత కొంత అన్నట్లుగా వ్రాయ కూడదు. సహజ భావన పాఠకులుమెచ్చు కొనునట్లుండవలెను.

ఏతద్విషయమున శ్రీ చింతావారు శ్రీశంకరుని భావముననుసరించియే - శ్లోకములకు పద్యములందించినారు. ఆయా ప్రతి పద్యమూ శంకరుని ప్రతిపాదిత భావమునే ప్రకటీకృతము చేయుచున్నది.

మొదట శ్రీగౌరీ ప్రార్థనాపద్యమునందే 

శా.  శ్రీమన్మంగళ! శాంభవీ జనని!  హృచ్ఛ్రీ చక్ర సంవాసినీ!

సామాన్యుండను, నీ కృపామృత రుచిన్ సౌందర్య సద్వీచికన్

నీమంబొప్పఁ దెనుంగు చేసెద, నతుల్, నీవే లసద్వాణిగాఁ

బ్రేమన్ వెల్గుము శంకరాత్మ గతితోఁ బ్రీతిన్ గనన్ శంకరుల్.

అంటూ తాను సామాన్యుఁడనని, శ్రీ శంకరుని సౌందర్యలహరి అసామాన్యమని, ఆంధ్రానువాదము చేయుచుంటినని,  నీవే లసద్వాణిగాఁ బ్రేమన్ వెల్గుమంటూ  అనువాదమును ప్రారంభించి- అమ్మదయతో - అసామన్యమగు రీతిగా పద్యములను వ్రాసి తన ప్రతిభను వినయ మతితో తెలియఁజేసారు.

శంకరభగవత్పాదుల తొలి శ్లోకమగు “శివశ్శక్త్యా యుక్తో యది భవతి” ని మనోజ్ఞముగ అమ్మా! అంటూ త్రిమూర్తుల కర్తవ్యములను వారలకబ్బిన శక్తులకు నీవే మూలమనుచు చక్కని పదములతో రచించినారు. 

42వ శ్లోకమగు “గతైర్మాణిక్యత్వం…..ధిషణామ్.” ను అనువదించునపుడు పద్యమునందు చూపిన పద శైలి మూలశ్లోక భావమున కంటె మరింత గొప్పగానున్నది. 

60వ శ్లోకమగు “సరస్వత్యాస్సూక్తీ”….కినొనరించిన పద్యానువాదము ప్రశంసనీయము. పద్యమెత్తుగడలోనే “వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు”  అంటూ శ్రీ చింతావారు తనకున్న సంస్కృతభాషాపాండితీశోభను అసామాన్యమగు రీతిగా మనముందు కనబరిచినారు.

90వశ్లోకమున  “దదానే…..చరణతామ్.”  అను శ్లోక అనువాదమునందు తుమ్మెదను సుకాండి యను పదప్రయోగమును జూపి తమకున్న పర్యాయపద ప్రయోగ చాతురిని ప్రదర్శించినారు.

నివేదనలో సౌందర్యలహరి మరియు తానొనర్చిన పద్యానువాదమునందలి పద్యములను పాఠకులు చదివినచో కవియైన నన్ను, చదివిన చదువరులనెల్లరను దయతో చూడుమని, ఫలశ్రుతిని వెల్లడి చేసినారు.

ఇలా వంద శ్లోకములకు వంద పద్యములు, వంద ప్రతిపదార్థములు, వందభావములను వ్రాసి శ్రీ రామకృష్ణారావు శ్రీ శంకరుల కృపకు, ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల దయకు పాత్రులైనారు.

*పుంభావ భారతీ* బిరుదుప్రదానము చేయుచు పంచరత్నములు.

కం.  చింతా యను పద భావమె

చింతించుట యగును, మీరు చిత్తమునందున్

సంతతము చింత చేయుచు,

సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.

కం.  ఎన్నని వ్రాయుదురయ్యా!

ఎన్నగ మీ ప్రాయ మెంత? యెసగెడు చిత్తం

బున్నట్టి శక్తి సంపద

లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!

కం.  పద్దెములెన్నివిధంబులొ

యద్దెస మీ గమనముండు, నాలోచనముల్

తద్దిశ మెరయున్ గావ్యం

బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.

కం.  *పుంభావ భారతీ* యని

సంబోధనతోడ మిమ్ము చక్కగఁబిలుతున్

బింబోష్ఠివాణి ఘనధీ

సంబంధయుతుండవౌట సత్కవివర్యా!

కం.  సొంపగునీ బిరుదమ్మున్

సొంపుగ నే నిచ్చుచుంటి సుందరమతితో

న్నింపుగ నను మన్నించుచు

కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!

చక్రాల లక్ష్మీకాంతరాజారావు

19 . 10 . 2024.

చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., పుంభావభారతీ , పద్యకవితాభిరామ,  చిత్రకవితాసహస్రఫణి, చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ., POL.,M.A.,.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.
 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, 
     ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో  
     వ్రాసినది.)
 3) ఆంధ్రసౌందర్యలహరి.
 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో   
     అనేక స్వీయ రచనలు.
 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి పద్యానువాదము.
13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత  
     సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు తెలుగు భావము.
18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో 
     వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 
23) శ్రీ అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 
      నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య 
      శతకము.)
30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 
      (బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో 
       మూడు శతకములు.) 
36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క 
      రోజులో వ్రాసినది.)
38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త 
      శివశతకము.
39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 
      సీతాన్వయముగా తేటగీతి పద్యముల 
      హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల 
      నక్షత్రమాల.)
40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార 
      ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక.
42) శ్రీరామ పట్టాభిషేకం.
43) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)
      ( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.
జైహింద్.

సౌందర్య లహరి 91-95పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు, సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
91 వ శ్లోకము.  
పదన్యాసక్రీడా పరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి |
అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణిత
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే  ||
పదచ్ఛేదము.
పదన్యాసక్రీడా - పరిచయమ్ -  ఇవ -  ఆరబ్ధు - మనసః - 
స్ఖలంతః - తే -  ఖేలమ్ -  భవన - కలహంసాః - న జహతి -
అతః - తేషామ్ -  శిక్షామ్  -  సుభగ - మణి - మంజీర - రణిత
ఛలాత్ -  ఆచక్షాణమ్ -  చరణ - కమలమ్ -  చారు - చరితే.
అన్వయక్రమము.
చారుచరితే, తే, భవన, కలహంసాః, పద, న్యాస,  క్రీడా, పరిచయమ్, ఆరబ్ధుమనసః ఇవ, స్ఖలంతః , ఖేలమ్, న జహతి, అతః, చరణ కమలమ్, సుభగ, మణిమంజీర, రణిత,ఛలాత్‌, తేషామ్, శిక్షామ్, ఆచక్షాణమ్.
పద్యము.
శా.  నిత్యంబున్ గలహంసలెన్నొ కనుచున్  నీదౌ పదన్యాసమున్
బ్రత్యేకంబుగ నేర్చుచుండె జననీ! వర్ధిల్లగా నెంచి, యౌ
న్నత్యంబుం గొలుపంగ శిక్షణము గ్రన్నన్ నేర్పునట్లొప్పుచున్
నిత్యంబీవు ధరించునందెల రవల్ స్నిగ్ధంబుగా నొప్పెడిన్.॥ 91 ॥
ప్రతిపదార్థము. 
చారుచరితే = సుందరమైన నడతగల ఓ దేవీ, 
తే = నీ యొక్క, 
భవన = ఇంటియందలి, 
కలహంసాః = పెంపుడు హంసల యొక్క, 
పద = పాదములను, 
న్యాస = ఉంచుట యందలి,  
క్రీడా = ఆటయందు, 
పరిచయమ్ = శిక్షణవలె, 
ఆరబ్ధుమనస ఇవ = పొందగోరు మనస్సు గలవైనవాటివలె, 
స్ఖలంతః = జాఱుచున్న నడక గలవై, 
ఖేలమ్ = విలాస గమనమును, 
న జహతి = వదలుట లేదు, 
అతః = ఇందువలన, 
చరణ కమలమ్ = నీ పాదపద్మము, 
సుభగ = సుందరమైన, 
మణిమంజీర = మణులతో గూడిన అందియ యొక్క, 
రణిత = సవ్వడుల యొక్క ,
ఛలాత్‌ = నెపము వలన, 
తేషామ్ = ఆ కలహంసలకు, 
శిక్షామ్ = నడకకు సంబంధించిన శిక్షణగ అగుటకు, 
ఆచక్షాణమ్ = నేర్పుచున్నది వలె వున్నది. 
భావము. 
ఓ చారుచరితా ! నీ అద్భుత గమన విన్యాసాన్ని గాంచి నడక నేర్చుకోదలచినవై, నీ పెంపుడు హంసలు తొట్రుపాటు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి. అందువల్ల నీ పాద కమలం కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో, ఆరాజహంసకు ఖేలన శిక్షను గరుపుతున్నట్లుగా ఉన్నది.

92 వ శ్లోకము.  
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః
శివస్స్వచ్ఛచ్ఛాయా ఘటిత కపటప్రచ్ఛదపటః |
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ ||
పదచ్ఛేదము.
గతాః - తే -  మంచత్వమ్ -  ద్రుహిణ - హరి - రుద్ర -  ఈశ్వర - భృతః -
శివః -  స్వచ్ఛ - ఛాయా - ఘటిత - కపట - ప్రచ్ఛద - పటః -
త్వదీయానామ్ -  భాసామ్ -  ప్రతి ఫలన -  రాగ -  అరుణతయా -
శరీరీ - శృంగారః -  రసః - ఇవ - దృశామ్ -  దోగ్ధి - కుతుకమ్ .
అన్వయక్రమము.
ద్రుహిణ, హరి, రుద్ర, ఈశ్వర, భృతః, తే, మంచత్వమ్, గతాః, శివః, స్వచ్ఛ ఛాయా, కపట, ఘటిత, ప్రచ్చద పటః,  త్వదీయానామ్, భాసామ్ , ప్రతిఫలన, రాగ , అరుణతయా, శరీరీ, శృంగారః రస ఇవ, దృశామ్, కుతుకమ్, దోగ్ధి.
పద్యము.
చం.  శివుఁడును, బ్రహ్మ విష్ణువులు, శ్రీకరి! రుద్రుఁడు మంచమై భరిం
ప, వర సదా శివత్వమది వర్ధిలు కాంతినెపంబు నొప్పి నీ  
బ్రవర నిచోళమై తనరి, భాసిలు నీదగు రాగ శోణమౌ
చు, వలపు బోళ మమ్మ! తమ శోభిలు కన్నులవిందుఁ జేసెనే. ॥ 92 ॥
(బోళము=రసము)
ప్రతిపదార్థము.  
(హే జగజ్జననీ = ఓ లోకమాతా,)
ద్రుహిణ = బ్రహ్మ, 
హరి = విష్ణువు, 
రుద్ర = రుద్రుడు, 
ఈశ్వర = ఈశ్వరుడు, 
భృతః = భరించువారుగా ఈ నలుగురు, 
తే = నీ యొక్క, 
మంచత్వమ్ = మంచము యొక్క రూపముగా అగుటను, 
గతాః = పొందినవారైరి, 
శివః = సదాశివ తత్త్వము, 
స్వచ్ఛచ్ఛాయా = నిర్మలమైన కాంతి అను, 
కపట = నెపము గల, 
ఘటిత = కూడబడిన, 
ప్రచ్చద పటః= కప్పుకొను దుప్పటియై,  
త్వదీయానామ్ = నీకు సంబంధించిన వారైన, 
భాసామ్ = కాంతుల యొక్క, 
ప్రతిఫలన = ప్రతిఫలించుటచేతనైన, 
రాగ= ఏ ఎఱ్ఱదనము సంక్రమించినదో దానినే, 
అరుణతయా = రక్తవర్ణమగుటచే, 
శరీరీ = భౌతికమైన రూపు పొందిన, 
శృంగారః రస ఇవ = శృంగార రసము వలె, 
దృశామ్ = నీ యొక్క వీక్షణములకు, 
కుతుకమ్ = ఆనందమును, 
దోగ్ధి = పిదుకుచున్నాడు, అనగా - కలిగించుచున్నాడు. 
భావము. 
హే భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే అధికార పురుషులు నలుగురు మహేశ్వరతత్త్వంలో అంతర్గతులైనవారు కాబట్టి నువ్వు అధిష్ఠించే మంచముయొక్క నాలుగు కోడులై వున్నారు. సదాశివుడు విమలకాంతి ఘటనారూపం వ్యాజాన దుప్పటమగుతూ , నీ మేనికాంతులు ప్రతిఫలించటంచేత ఎర్రబారిమూర్తిమంతమైన శృంగారరసంవలె నయనాలకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ( తెల్లని కాంతిగల శివుడు దేవి మేని ఎర్రని కాంతులు ప్రతిఫలించగా ఎర్రనివాడై ఆమెను సేవిస్తున్నాడని భావము.)

93 వ శ్లోకము.  
అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే
జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా  ||
పదచ్ఛేదము.
అరాళా  - కేశేషు -  ప్రకృత - సరళా-  మంద - హసితే -
శిరీష -  ఆభా - చిత్తే - దృషత్ -  ఉపల - శోభా - కుచ - తటే -
భృశమ్ -  తన్వీ - మధ్యే - పృథుః - ఉరసి - జ -  ఆరోహ  - విషయే -
జగత్ -  త్రాతుమ్ -  శంభోః -  జయతి - కరుణా - కాచిత్ -  అరుణా.
అన్వయక్రమము.
కేశేషు, అరాళా, మంద హసితే, ప్రకృతి, సరళా, చిత్తే, శిరీష + ఆభా, కుచ తటే, దృషత్‌ + ఉపల శోభా, మధ్యే, భృశమ్, తన్వీ, ఉరసి జ, ఆరోహ, పృథుః, శంభోః , కాచిత్‌, అరుణా, కరుణా, జగత్‌, త్రాతుమ్, జయతి.
పద్యము.
చం.  జనని యరాళ కేశములు, చక్కని నవ్వు, శిరీషపేశలం
బన మది, రొమ్ముభాగము మహాఘనమౌ యుపల ప్రశోభయున్, 
స్తన జఘనంబులన్ ఘనము, సన్నగఁ జిక్కిన కౌను, కాచెడున్
ఘనమగు శ్రీసదాశివుని కమ్మని యా యరుణప్రభల్ క్షితిన్. ॥ 93 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ ) 
కేశేషు = కురులందు, 
అరాళా = వంకరయైనదియు, 
మంద హసితే = చిఱునవ్వునందు, 
ప్రకృతి = స్వభావము చేతనే, 
సరళా = సుకుమారమైనదియు, 
చిత్తే = మనస్సునందు, 
శిరీష + ఆభా = దిరిసెన పూవు వంటి మెత్తని స్వభావము గలదియు, 
కుచ తటే = వక్షః స్థలము, 
దృషత్‌ + ఉపలశోభా = సన్నికల్లు పొత్రమువంటి బలుపుగలదియు, 
మధ్యే = నడుమునందు,
భృశమ్ = మిక్కిలి,
తన్వీ = కృశించినదియు,
ఉరసి జ = స్తనముల విషయమునందును, 
ఆరోహ = పిరుదుల విషయమునందును, 
పృథుః = మిగుల గొప్పదియు, 
శంభోః = సదాశివునికి సంబంధమైనదగు, 
కాచిత్‌ = వర్ణనాతీతమైన, 
అరుణా = “అరుణ” అనుశక్తి, 
కరుణా = దయాస్వరూపము గలది, 
జగత్‌ = ప్రపంచమును, 
త్రాతుమ్ = రక్షించుటకు, 
జయతి = సర్వోత్కర్షతో వర్తించుచున్నది.  
భావము. 
తల్లీ ! శంభుడి అనిర్వాచ్యమైన అరాళా అనేశక్తి నీ కురులలో ప్రకాశిస్తోంది. చిరునవ్వులో నీదు సహజమైన సరళా అనేశక్తి ప్రకాశిస్తూంది. చిత్తంలో దిరిసెన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్తనప్రదేశంలో సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూలశక్తి ప్రకాశిస్తూంది. దేవి జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తీ, కరుణ అనే శక్తీ భాసిల్లుతున్నాయి.

94 వ శ్లోకము.  
కళంకః కస్తూరీ రజనికర బింబం జలమయం
కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితమ్ |
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే ॥
పదచ్ఛేదము.
కళంకః  - కస్తూరీ - రజ నికర  బింబమ్ -  జల - మయమ్ -
కళాభిః - కర్పూరైః -  మరకత - కరండమ్ -  నిబిడితమ్ -
అతః -  త్వత్ -  భోగేన - ప్రతిదినమ్ -  ఇదమ్ -  రిక్త - కుహరమ్ -
విధిః -  భూయః -  భూయః -  నిబిడయతి - నూనమ్ -  తవ - కృతే.
అన్వయక్రమము.
ఇదమ్, కలంకః, కస్తూరీ, రజని కర బింబమ్, జలమయమ్, కళాభిః, కర్పూరైః, నిబిడితమ్, మరకత కరండమ్, అతః, ప్రతిదినమ్ , త్వత్‌ భోగేన, రిక్త కుహరమ్, విధిః, భూయః భూయః, తవకృతే, నిబిడయతి, నూనమ్. 
పద్యము.
చం. చందురుఁడంచునెంచునది చంద్రుఁడు కాదు, మరక్త పేటియే, 
యందలి మచ్చ నీదగు ప్రియంబగు కస్తురి, యెవ్వరెన్నుచున్ 
జందురుడందురందరది చక్కని నీ జలకంపుఁ దావగున్,
జందురునొప్పునాకళలు చల్లని కప్రపు మొట్టికల్ సతీ!
యందవి నీవు వాడ విధి యాత్రముతోడను నింపువెండియున్. ॥ 94 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ! = ఓ లోకమాతా!) 
ఇదమ్ = ఈ కనబడు చంద్రమండలమునందు, 
కలంకః = ఆకలిగిన చిహ్నము, 
కస్తూరీ = అది కస్తూరి అగును, 
రజని కర బింబమ్ = చంద్రబింబమనినచో, 
జలమయమ్ = అది జలస్వరూపమైనది, 
కళాభిః = కిరణములనే, 
కర్పూరైః = పచ్చకర్పూరముతో, 
నిబిడితమ్ = నిండింపఁ బడినది అగు, 
మరకత కరండమ్ = గరుడ పచ్చలచే నిర్మింపబడిన భరణియగును, 
అతః = ఈ కారణమున, 
ప్రతిదినమ్ = దినదినమునందు, 
త్వత్‌ భోగేన = నీవు వాటిని ఉపయోగించుట చేత, 
రిక్త కుహరమ్ = ఖాళీ అయిన లోపలిభాగము కలది, 
విధిః = బ్రహ్మ, 
భూయః భూయః = మరల మరల, 
తవకృతే = నీ కొఱకు, 
నిబిడయతి = ఆయా వస్తువుల చేత నిండించుచున్నాడు. 
నూనమ్ = ఇది నిశ్చయము, 
భావము. 
తల్లీ! జగజ్జననీ! ఆకాశములో కనబడు చంద్రమండలము – మరకత మణులచే చేయబడి, నువ్వు – కస్తూరి, కాటుక, పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకొను భరణియే! చంద్రునిలో మచ్చవలె నల్లగా కనబడునది కస్తూరి. ఆ చంద్రునిలోని జలతత్త్వము – నువ్వు జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు. చంద్రుని కళలుగా భావించబడునవి – పచ్చకర్పూరపు ఖండములు. ఈ వస్తువులు ఆ భరణి నుండి నువ్వు ప్రతిదినము వాడుకొనుచుండుట వలన తరిగి పోవుటచే -నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టిపనిచేయు బ్రహ్మ మరల ఆ వస్తువులను పూరించుచున్నాడు. 

95 వ శ్లోకము.  
పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరలకరణానామసులభా |
తథా హ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతస్స్థితిభిరణిమాద్యాభిరమరాః   ||
పదచ్ఛేదము.
పుర -  ఆరాతేః -  అంతః - పురమ్ -  అసి -  తతః -  త్వత్ -  చరణయోః -
సపర్యా - మర్యాదా - తరల - కరణా - నామ - సులభా -
తథాహి -  ఏతే - నీతాః -  శతమఖ - ముఖాః -  సిద్ధిమ్ -  అతులామ్ -
తవ - ద్వార -  ఉపాంతః -  స్థితిభిః -  అణిమ -  ఆద్యాభిః - అమరాః.
అన్వయక్రమము.
పుర + అరాతేః, అంతఃపురః, అసి, తతః, త్వత్‌ చరణయోః, సపర్యా మర్యాదా, తరళ కరణానామ్, అసులభా, తథాహి, అణిమాదిభిః, ఏతే, శత మఖముఖాః, అమరాః, తవ, ద్వార + ఉపాంతస్థితిభిః, అతులామ్, సిద్ధిమ్, నీతాః.
పద్యము.
ఉ.  పట్టపురాణివాశివుని పార్వతి! నీ పద పూజనంబహో
యెట్టులఁ గల్గు నల్పులకు? నింద్రుఁడు మున్నగువారలున్ నిను
న్నట్టులె చూడ ద్వారముల కావలె యుండియు సిద్ధులొందిరో
గట్టుతనూజ! నే నెటుల గాంచగఁ జాలుదు నిన్ భజింపగన్? ॥ 95 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ) 
పుర + అరాతేః = త్రిపుర హరుడైన శివుని యొక్క, 
అంతఃపురః = అంతఃపురవాసినియగు పట్టమహిషివి, 
అసి = అయియున్నావు, 
తతః = ఆ కారణము వలన, 
త్వత్‌ చరణయోః = నీ పాదముల యొక్క, 
సపర్యా మర్యాదా = పూజచేయు భాగ్యము, 
తరళ కరణానామ్ = చపల చిత్తులకు, 
అసులభా = సులభమైనది కాదు, 
తథాహి = అది యుక్తమే అగును (ఎందువలన అనగా), 
అణిమాదిభిః = అణిమ మొదలగు అష్టసిద్ధుల చేతనొప్పు, 
ఏతే = ఈ, 
శత మఖముఖాః = ఇంద్రాదులైన, 
అమరాః = దేవతలు, 
తవ = నీ యొక్క, 
ద్వార + ఉపాంతస్థితిభిః = అంతఃపుర ద్వార సమీపము నందుండినవారై, 
అతులామ్ = సాటిలేని, 
సిద్ధిమ్ = ఇష్టార్థ ఫలసిద్ధిని, 
నీతాః = పొందిరి. 
భావము. 
అమ్మా! జగజ్జననీ! నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి. అందువలన నీ పాద పద్మపూజ చేయగల భాగ్యము చపల చిత్తులైన వారికి లభించునది గాదు. అందువలననే ఈ ఇంద్రాది దేవతలందరూ, తాము కోరుకున్న అల్పమైన అణిమాది అష్టసిద్ధుల గూడి, వారితో పాటు నీ ద్వార సమీపమునందే కావలివారి వలె పడిగాపులు గాచుచున్నారు.
జైహింద్.

Thursday, May 1, 2025

సౌందర్య లహరి 86 - 90 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు, సంగీతం గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.
86 వ శ్లోకము.  
మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |
చిరాదంతశ్శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశాన రిపుణా || 
పదచ్ఛేదము.
మృషా - కృత్వా  - గోత్ర - స్ఖలనమ్ - అథ - వైలక్ష్యనమితమ్ -
లలాటే - భర్తారమ్ -  చరణ - కమలే - తాడయతి - తే -
చిరాత్ -  అంతః -  శల్యమ్ -  దహన - కృతమ్ -  ఉన్మూలితవతా - 
తులాకోటి - క్వాణైః - కిలికిలితమ్ -  ఈశాన - రిపుణా.
అన్వయక్రమము.
మృషా, గోత్ర స్ఖలనమ్, కృత్వా, అథ, వైలక్ష్య, నమితమ్, భర్తారమ్, తే, చరణ కమలే, లలాటే, తాడయతి, ఈశాన రిపుణా, చిరాత్‌, దహనకృతమ్, అంతశ్శల్యమ్, ఉన్మూలితవతా, తులాకోటి, క్వాణైః, కిలికిలితమ్.
పద్యము. 
చం.  పొరపడి నీ సపత్నినధిపుం డల పిల్చియు తెల్లఁబోయి, నీ
చరణము మ్రొక్కఁ, దన్నితివి శంభుని ఫాలముపై, మనంబులో
స్మరుఁడు దహింపఁబడ్డ యవమానపుఁ గంటకుఁడై హసించిన
ట్లరయగ నూపురధ్వని మహాద్భుత కిల్కిలశబ్దమొప్పెనే,॥ 86 ॥
ప్రతిపదార్థము.
(జగజ్జననీ! = లోకమాతా!)
మృషా = వృథాగా,
గోత్ర స్ఖలనమ్ = భార్యను సవతి పేరుతో పిలుచుట, 
కృత్వా = చేసి, 
అథ = ఆ తర్వాత, 
వైలక్ష్య = వెల్లపాటుచే, 
నమితమ్ = పాద ప్రణామము చేసిన, 
భర్తారమ్ = పతి అగుశివుని, 
తే = నీ యొక్క, 
చరణ కమలే = పాదపద్మముతో, 
లలాటే = లలాట ప్రదేశమునందు, అనగా - ఫాల భాగము నందు, 
తాడయతి = తన్నినదానివి కాగా, 
ఈశాన రిపుణా = శివుని శత్రువగు మన్మథుని చేత, 
చిరాత్‌ = చాలా కాలము నుండి (బాధించు చున్న) 
దహనకృతమ్ = (శివుని మూడవకంటి) చిచ్చుచేత, కాల్చబడినదై చేయబడిన, 
అంతశ్శల్యమ్ = హృదయమునందున్న వైరమును, (బాధ)
ఉన్మూలితవతా =మాపుకొనిన వానికి, (తీరినవాడయిన మదనునికి),
తులాకోటి = నీ కాలి అందెల యొక్క, 
క్వాణైః = మ్రోతల చేత, 
కిలికిలితమ్ = కిలకిలా రావానుకరణముతో విజయ సూచక మగుచున్నది.  
భావము. 
తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక వెలవెలబాటుచే లొంగిన భర్తను, నీ చరణ కమలంతో నుదుట తాడనం జరుపగా గాంచి శివుడికి శత్రువైన మన్మథుఁడు (ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని) నీ కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.

87 వ శ్లోకము.  
హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక చతురౌ
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ |
వరం లక్ష్మీపాత్రం శ్రియ మతిసృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్  ||
పదచ్ఛేదము.
హిమానీ - హంతవ్యమ్ -  హిమ - గిరి - నివాస -  ఏక చతురౌ -
నిశాయామ్ -  నిద్రాణమ్ -  నిశి - చరమ - భాగే -  చ -  విశదౌ -
వరమ్ -  లక్ష్మీ - పాత్రమ్ -  శ్రియమ్ -  అతి - సృజంతౌ - సమయినామ్ -
సరోజమ్ -  త్వత్ - పాదౌ - జనని - జయతః -  చిత్రమ్ -  ఇహ - కిమ్ .
అన్వయక్రమము.
జనని,  హిమగిరి, నివాస, ఏకచతురౌ, నిశి, చరమ భాగేచ, విశదౌ, సమయినామ్, శ్రియమ్, అతి సృజంతౌ, త్వత్‌ పాదౌ,  హిమానీ, హంతవ్యమ్, నిశాయామ్, నిద్రాణమ్, వరమ్, లక్ష్మీపాత్రమ్, సరోజమ్, జయతః. ఇహ, కిం చిత్రమ్.
పద్యము.
ఉ.  నీ పదముల్ హిమాద్రిపయి నేర్పున నిల్చును, శుద్ధమై, పవల్ 
మాపటి యంతమందునను, మాయవు, భక్తులభాగ్యమౌచు నా
మాపటి వేళఁ గ్రుంకుచును, మంచున మాసెడి శ్రీకిఁ పీఠమై,
ప్రాపుగనున్న పద్మమును వాసిగ గెల్చుట చిత్రమా? సతీ! ॥ 87 ॥
ప్రతిపదార్థము.
జనని = తల్లీ,  
హిమగిరి =మంచుకొండ యందు, 
నివాస = నివసించుటలో, 
ఏకచతురౌ = నైపుణ్యము గలవియు, 
నిశి = రాత్రియందును, 
చరమ భాగేచ = రాత్రి చివరి సమయములందు గూడ, 
విశదౌ = ప్రకాశ వికాసము గలవియు, 
సమయినామ్ = సమయాచారపరులైన భక్తులకు, 
శ్రియమ్ = సంపదను, 
అతిసృజంతౌ = మిక్కుటముగా కలుఁగఁ జేయునవియును అయిన, 
త్వత్‌ పాదౌ = నీ పాదములు,  
హిమానీ = మంచుచే, 
హంతవ్యమ్ = నశింపచేయ తగినవియు, 
నిశాయామ్ = రాత్రియందు, 
నిద్రాణమ్ = నిద్రించునదియు, 
వరమ్ = ఇష్టమైన, 
లక్ష్మీపాత్రమ్ = లక్ష్మీదేవి అధిష్ఠించుటకు పీఠమైన, 
సరోజమ్ = పద్మమును, 
జయతః = జయించుచున్నవి. 
ఇహ = ఈ విషయమునందు, 
కిం చిత్రమ్ = ఏమి ఆశ్చర్యమున్నది? 
భావము. 
ఓ జననీ! మంచుకొండలలో సైతం కుంచించుకు పోకుండా ఉండగలిగేవీ రాత్రీ పగలు వికసిస్తూ నీ భక్తులకు అనూన సంపదలను కలిగించేవీ ఐన నీ పాద కమలాలతో , మంచుచేత నశింపజేయదగినదీ లక్ష్మీదేవికి ఆలవాలమై రాత్రివేళలో ముడుచుకొని పోయేదీ ఐన సామాన్య కమలం ఏవిధంగానూ సరితూగదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నది ? 

88 వ శ్లోకము.  
పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పర తులామ్ |
కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా  || 
పదచ్ఛేదము.
పదమ్ -  తే - కీర్తీనామ్ -  ప్రపదమ్ -  అపదమ్ -  దేవి - విపదామ్ -
కథమ్ -  నీతమ్ -  సద్భిః - కఠిన - కమఠీ - కర్పర - తులామ్ -
కథమ్ -  వా - పాణిభ్యామ్ -  ఉపయమన - కాలే - పురభిదా - 
యత్ -  ఆదాయ - న్యస్తమ్ -  దృషది -  దయమానేన - మనసా .
అన్వయక్రమము.
దేవి, కీర్తీనామ్, పదమ్, విపదామ్, అపదమ్, తే, ప్రపదమ్, సద్భిః, కఠిన, కమఠీ, కర్పర, తులామ్, కథమ్, నీతమ్, ఉపయమనకాలే, పురభిదా, పాణిభ్యామ్, యత్‌, దయామానేన, మనసా, ఆదాయ, కథం వా, దృషది, న్యస్తమ్.
పద్యము.
శా.  ఆమ్మా! కీర్తికి దావలంబగుచు, ఘోరాఘంబులన్, వ్యాధులన్,
నెమ్మిన్ బాపు సుకోమలంబయినవౌ నీ పాద పైభాగమున్,
సమ్మాన్యుల్,కమఠీకరోటి యనగన్ సామ్యంబె? శ్రీకంఠుఁ డో
యమ్మా! పెండ్లికి సన్నికల్లుపయినె ట్లానించె నీ పాదముల్. ॥ 88 ॥
ప్రతిపదార్థము.
దేవి = ఓ పార్వతీదేవీ,  

కీర్తీనామ్ = యశస్సులకు, 
పదమ్ = ఉనికిపట్టును, 
విపదామ్ = ఆపదలకు, 
అపదమ్ = కానిచోటును, (అయిన) ,
తే = నీ యొక్క, 
ప్రపదమ్ = పాదము చివరి భాగము, 
సద్భిః = సత్కవులచేత ,
కఠిన = బిరుసయిన, 
కమఠీ = ఆడుతాబేలు యొక్క, 
కర్పర = వీపుపై డిప్పతో, 
తులామ్ = పోలికను, 
కథమ్ = ఏ విధముగా, 
నీతమ్ = పొందఁబడినది, 
ఉపయమనకాలే = వివాహ సమయమందు, 
పురభిదా = త్రిపురహరుడైన శివుని, 
పాణిభ్యామ్ = హస్తముల చేత, 
యత్‌ = ఏ నీ పాదము, 
దయామానేన = దయగల, 
మనసా = మనస్సు చేత, 
ఆదాయ = పట్టుకోబడి, 
కథం వా = ఏ విధముగా, 
దృషది = సన్నికల్లుపైన, 
న్యస్తమ్ = ఉంచ బడినవి. 
భావము. 
ఓ దేవీ! కీర్తికినెలవై సంకటములను పారదోలు కుసుమసుకుమారమగు నీపాదమును మహాకవులు క్రూరముగా తాబేటిబొచ్చెతో నెట్లుపోల్చిరో తెలియదు. వివాహకాలమందు శంకరుడు తాను దయగలవాడయ్యుండి రెండుచేతులతోబట్టి యెట్లుసన్నెకంటి (నూఱుడుఱాయి) ని నొక్కించెనో తెలియదు.

89 వ శ్లోకము.  
నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభి
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ |
ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ  ||
పదచ్ఛేదము.
నఖైః -  నాక - స్త్రీణామ్ -  కర - కమల - సంకోచ - శశిభిః -
తరూణామ్ -  దివ్యానామ్ -  హసత - ఇవ - తే - చండి - చరణౌ -
ఫలాని - స్వస్థేభ్యః  -  కిసలయ - కర -  అగ్రేణ - దదతామ్ -
దరిద్రేభ్యః -   భద్రామ్ -  శ్రియమ్ -  అనిశమ్ -  అహ్నాయ - దదతౌ .
అన్వయక్రమము.
చండి, దరిద్రేభ్యః, భద్రామ్, శ్రియమ్, అనిశమ్, అహ్నాయ, దదతౌ, తే, చరణౌ, నాక స్త్రీణామ్, కర, కమల, సజ్కోచ, శశిభిః, నఖైః, స్వఃస్థేభ్యః, ఫలాని, కిసలయ, కర, అగ్రేణ, దదతామ్, దివ్యానామ్, తరూణామ్, హసత ఇవ.
పద్యము.
ఉ.  పేదకు పుష్కలంబుగ భువిన్ సిరులిచ్చెడి నీదుపాదముల్
బాధను దేవమానినుల పాణ్యుదజంబుల మోడ్పుఁ గొల్పుటన్
గ్లేదువులౌ నఖాళిఁ బరికింపగ దైవతపాళి కోరికల్
లేదనకిచ్చు కల్పకపు లే జివురాకుల గేలి చేసెడిన్. ॥ 89 ॥
ప్రతిపదార్థము.
చండి = ఓ పార్వతీ, 
దరిద్రేభ్యః = బీదల కొఱకు, 
భద్రామ్ = పుష్కలమైన, 
శ్రియమ్ = లక్ష్మిని, 
అనిశమ్ = ఎల్లపుడు, 
అహ్నాయ = శీఘ్రముగా, 
దదతౌ = ఇచ్చుచున్న, 
తే = నీ యొక్క, 
చరణౌ =  పాదములు, 
నాక స్త్రీణామ్ = దేవ వనితల యొక్క, 
కర = హస్తములనెడి, 
కమల = తామర పూవులను, 
సంకోచ = ముకుళింపఁ జేయుట యందు, 
శశిభిః = చంద్రులైన (దేవి పాదదర్శన మైనతోడనే దేవాంగనలు అంజలి ఘటియింతురు), 
నఖైః = గోళ్ల చేత, 
స్వఃస్థేభ్యః = స్వర్గ మందున్న (సర్వసంపత్సమృద్ధిగల) దేవతల కొఱకు, 
ఫలాని = కోరిన వస్తువులను, 
కిసలయ = చిగురుటాకులవంటి, 
కర = హస్తముల యొక్క, 
అగ్రేణ = కొనలచేత, 
దదతామ్ = ఇచ్చుచున్న, 
దివ్యానామ్ = స్వర్గమందున్న, 
తరూణామ్ = కల్పవృక్షములకు, 
హసత ఇవ = నవ్వుచున్నవో అనువిధముగ ఉన్నవి.
భావము. 
చండీ నామంతో శోభిల్లే తల్లీ ! నీ పాదాలు, సకలసంపదలతో తులతూగుతున్న దేవతలకు మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని తలదన్నుతూ , దీనజనులకు మంగళకరమైన అధిక సంపదలను ఒసగుతున్నాయి. నీ గోళ్ళు దేవతాస్త్రీల కరపద్మాలను ముకుళింపజేసే చంద్రుడిలా శోభిల్లుతున్నాయి.

90 వ శ్లోకము.  
దానే దీనేభ్యశ్శ్రియమనిశమాశాసుసదృశీ
మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి |
తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే
నిమజ్జన్ మజ్జీవః కరణ చరణైష్షట్ చరణతామ్  ||
పదచ్ఛేదము.
దదానే - దీనేభ్యః -  శ్రియమ్ -  అనిశమ్ -  ఆశాసు - సదృశీమ్ -
అమందమ్ -  సౌందర్య - ప్రకర - మకరందమ్ -  వికిరతి -
తవ -  అస్మిన్ - మందార - స్తబక - సుభగే - యాతు - చరణే -
నిమజ్జన్ - మత్ -  జీవః-  కరణ - చరణైః -  షట్ - చరణతామ్.
అన్వయక్రమము.
దీనేభ్యః, శ్రియమ్, అనిశమ్, ఆశాను సదృశీమ్, దదానే, అమందమ్, సౌందర్య, ప్రకర , మకరందమ్, వికిరతి, మందార, స్తబకసుభగే, అస్మిన్‌, తవ, చరణే, కరణ చరణైః, మత్‌ జీవః, నిమజ్జన్‌, షట్చరణతామ్, యాతు.
పద్యము.
మ.  వన మందార సుపుష్పగుచ్ఛములు నీ పాదద్వయంబెన్న, భా
వనఁ జేయంగ మరందముల్ చిలుకుచున్ భాగ్యాళినిచ్చున్గదా,
నిను భావించెడి నాదు జీవన సుకాండి క్షోభలే పాయుతన్
వినుతిన్ నీపదపద్మసన్మధువులే ప్రీతిన్ సదా క్రోలుటన్. ॥ 90 ॥ (సుకాండి=తుమ్మెద)
ప్రతిపదార్థము.
(జగజ్జననీ! = ఓ లోకమాతా! )
దీనేభ్యః = దరిద్రుల కొఱకు, 
శ్రియమ్ = సిరిసంపదలను, 
అనిశమ్ = ఎల్లప్పుడు, 
ఆశాను సదృశీమ్ = కోర్కెలకు తగినట్లుగా, 
దదానే = ఇచ్చుచున్నదియు, 
అమందమ్ = అధికమైన, 
సౌందర్య = అందము యొక్క, 
ప్రకర = సమూహము అను, 
మకరందమ్ = తేనెను, 
వికిరతి = వెదజల్లునదియు, 
మందార = మందారము అను, 
స్తబకసుభగే = కల్పవృక్షము యొక్క పూలగుత్తు వలె,  శోభాయమాన మైనదియు అగు, 
అస్మిన్‌ = ఈ (కనబడు,) 
తవ = నీ యొక్క, 
చరణే = పాదమునందు, 
కరణ చరణైః = అరు ఇంద్రియములచే, 
మత్‌ జీవః = నేను అను జీవుడు, 
నిమజ్జన్‌ = మునుగుచున్నవాడై, 
షట్చరణతామ్ = భ్రమర భావమును, 
యాతు = పొందుగాక ! 
భావము.
తల్లీ! భగవతీ! జగన్మాతా! దీనుల కెల్లరకును, వాంఛానురూపమైన (వారి వారి కోర్కెలననుసరించి) సంపదను నిరంతరం ప్రసాదించేదియును, మిక్కిలి సౌందర్యము, లావణ్య సమూహము అనుపూ దేనియను (మకరందమును) వెదజల్లుచున్నదియు, కల్పవృక్ష రూపమైన నీ పాద పద్మముల యందు.మనస్సు + పంచేంద్రియములు అనెడి ఆరు పాదముల భ్రమరమునై నీ పాదకమలములందలి మకరందమును గ్రోలుదును గాక. 
జైహింద్.

సౌందర్య లహరి 81-85పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.
81 వ శ్లోకము.                                                                                                         
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా
న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే |
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబ ప్రాగ్భారస్స్థగయతి లఘుత్వం నయతి చ  ||
పదచ్ఛేదము.
గురుత్వం - విస్తారమ్ -  క్షితి - ధర - పతిః -  పార్వతి - నిజాత్ -
నితంబాత్ - ఆచ్ఛిద్య - త్వయి - హరణ - రూపేణ - నిదధే -
అతః -  తే -  విస్తీర్ణః -  గురుః అయమ్ -  శేషామ్ -  వసుమతీమ్ - 
నితంబ - ప్రాక్ -  భారః -  స్థగయతి - లఘుత్వమ్ -  నయతి - చ.
అన్వయక్రమము.
పార్వతీ, క్షితిధరపతిః,  గురుత్వమ్, విస్తారమ్, నిజాత్‌, నితంబాత్‌, ఆచ్ఛిద్య, త్వయి, హరణ రూపేణ, నిదధే, అతః, తే, అయమ్, నితంబ, ప్రాగ్భారః, గురుః, విస్తీర్ణః, అశేషామ్, వసుమతీమ్, స్థగయతి, లఘుత్వమ్, నయతి చ.
పద్యము.
చం.  తనదు గురుత్వమున్, విరివి, తండ్రి నితంబము నుండి తీసి నీ
కని యరణం బొసంగుటను గల్గిన నీదు నితంబ భారమీ
ఘన ధరాభారమున్ గెలిచెఁ గప్పి విశాలతనొప్పి హైమ! నీ 
జనకుని కీర్తి పెంపుఁ గొనెఁ జక్కగ నీవు వెలుంగుచుండుటన్. ॥ 81 ॥
ప్రతిపదార్థము. 
పార్వతీ = ఓ గిరిజా , 
క్షితిధరపతిః = పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు,  
గురుత్వమ్ = బరువును, 
విస్తారమ్ = విశాలత్వమును, 
నిజాత్‌ = తనకు చెందిన, 
నితంబాత్‌ = కొండనడుమ నుండి, 
ఆచ్ఛిద్య = వేరుచేసి తీసి, 
త్వయి = నీయందు, 
హరణ రూపేణ = కూతురునకు తండ్రీ యిచ్చు స్త్రీ ధనము రూపముగా, 
నిదధే = సమర్పించెను, 
అతః = ఇందువలననే, 
తే = నీ యొక్క, 
అయమ్ = కనబడుచున్న, 
నితంబ = మొలవెనుకపట్టి యొక్క, 
ప్రాగ్భారః = అతిశయము, 
గురుః = గొప్పగా బరువు గలదియు, 
విస్తీర్ణః = విశాలమైనదియునగుచు, 
అశేషామ్ = సమస్తమైన, 
వసుమతీమ్ = భూమిని, 
స్థగయతి = కప్పుచున్నది, 
లఘుత్వమ్ = చులకనను, 
నయతి చ = పొందించుచున్నది కూడా.
భావము.
ఓ గిరిజా ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువును, విశాలత్వమును, తనకు చెందిన కొండనడుమ యందు గల చదునైన ప్రదేశము నుండి వేరుచేసి తీసి కూతురునకు తండ్రి యిచ్చు స్త్రీ ధనము రూపముగా సమర్పించెను, ఇందువలననే, నీ యొక్కకనబడుచున్న పిఱుదుల యొక్క అతిశయము, గొప్పగా బరువు గలదియు, విశాలమైనదగుచు, సమస్తమైన భూమిని, ఆచ్ఛాదించుచున్నది. అనగా, కప్పుచున్నది. చులకన చేయుచున్నది, అనగా - తన కంటె తక్కువ చేయుచున్నదికూడా.
82 వ శ్లోకము.  
కరీంద్రాణాం శుండాన్ కనకకదళీ కాండపటలీ
ముభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి |
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభద్వయమసి  ||
పదచ్ఛేదము.
కరీంద్రాణామ్ -  శుండాన్ - కనక - కదళీ - కాండ - పటలీమ్ -
ఉభాభ్యామ్ -  ఊరుభ్యామ్ -  ఉభయమ్ -  అపి - నిర్జిత్య -  భవతి -
సువృత్తాభ్యామ్ -  పత్యుః - ప్రణతి - కఠినాభ్యామ్ -  గిరి సుతే -
విధిజ్ఞే - జానుభ్యామ్ -  విబుధ - కరి - కుంభ ద్వయమ్ -  అసి.  
అన్వయక్రమము.
విధిజ్ఞే, గిరిసుతే! భవతి, కరీంద్రాణామ్, శుండాన్‌, కనక, కదళీ,కాండ, పటలీమ్, ఉభాభ్యాం ఊరుభ్యామ్, ఉభయం అపి, నిర్జిత్య, సువృత్తాభ్యామ్, పత్యుః, ప్రణతి కఠినాభ్యామ్, జానుభ్యామ్, విబుధ కరి, కుంభద్వయమ్, నిర్జిత్య, అసి.
పద్యము.
మ.  గిరిజా! సన్నుత! యో విధిజ్ఞ! జయసంకేతమ్మ!  నీ యూరువుల్
కరి తొండమ్ముల, నవ్యదివ్య కదళీకాండమ్ములన్ గెల్చునే,
పరమేశానుని సత్ప్రదక్షిణవిధిన్ బ్రార్థించుటన్ జానువుల్
కరి కుంభమ్ముల మించియుండెఁ, గన సంకాశమ్మె లేదీశ్వరీ! ॥ 82 ॥
ప్రతిపదార్థము.
విధిజ్ఞే = శాస్త్రార్థమునెఱింగిన, 
గిరిసుతే = ఓ పార్వతీ,
భవతి = నీవు, 
కరీంద్రాణామ్ = ఏనుగుల యొక్క, 
శుండాన్‌ = తొండములను, 
కనక = బంగారు, 
కదళీ = అరటి చెట్లయొక్క,
కాండ = స్తంభాల యొక్క,
పటలీమ్ = సమూహమును, 
ఉభాభ్యాం ఊరుభ్యామ్ = నీ రెండు తొడలచే, 
ఉభయం అపి = ఏనుగు తొండములు, అరటి స్తంభములు అను రెంటిని గూడ, 
నిర్జిత్య = జయించి,
సువృత్తాభ్యామ్ = అందముగాను, వర్తులాకారములోను వుండి, 
పత్యుః = భర్తయగు పరమేశ్వరునికి, 
ప్రణతి కఠినాభ్యామ్ = చేయు నమస్కారముల చేత కఠినములైన, 
జానుభ్యామ్ = మోకాళ్ళ చేత, 
విబుధ కరి = ఐరావతము యొక్క, 
కుంభద్వయమ్ = కుంభస్థలముల రెంటిని, 
నిర్జిత్య = జయించినదానివిగా, 
అసి = ఉంటివి.  
భావము. 
ఓ హిమగిరిపుత్రీ! వేదార్థవిధి నెఱిగి అనుష్ఠించే రాణీ, నీ ఊరువులు అందంలో గజరాజాల తొండములను ,బంగారు అరటిస్తంభాల సముదాయములను ధిక్కరిస్తున్నవి. నీ రెండు ఊరువులు ( తొడల) చేత జయించి , శోభనములై వర్తులములు కలిగినవీ భర్త ఐన పరమేశ్వరుడికి మ్రొక్కుటచేత గట్టిపడినవైన నీ జానువులు , ఐరావతం కుంభస్థలముల జంటలను కూడ జయించి ప్రకాశిస్తున్నాయి.( ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరం ఆమె సౌందర్యంతో తులతూగ గలదు ? తులతూగలేదు అని భావము.)

83 వ శ్లోకము.  
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢమకృత |
యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగలీ
నఖాగ్రచ్ఛద్మానస్సుర మకుట శాణైక నిశితాః  ||
పదచ్ఛేదము.
పరాజేతుమ్ -  రుద్రమ్ -  ద్విగుణ - శర - గర్భౌ  - గిరి - సుతే -
నిషంగౌ - జంఘే - తే-  విషమ - విశిఖః -  బాఢమ్ - అకృత -
యత్ -  అగ్రే -  దృశ్యంతే - దశ - శర - ఫలాః - పాద - యుగలీ -
నఖ -  అగ్ర -  ఛద్మానః -  సుర - మకుట - శాణ -  ఏక - నిశితాః.
అన్వయక్రమము.
గిరిసుతే, విషమ విశిఖః, రుద్రమ్, పరాజేతుమ్, తే, జంఘే, ద్విగుణ,  శర, గర్భౌ, నిషంగౌ, అకృత, బాఢమ్,యత్‌ + అగ్రే, పాద యుగలీ, నఖ + అగ్ర, ఛద్మానః, సుర, మకుట, శాణ, ఏక నికషాః, దశ, శర, ఫలాః, దృశ్యంతే.
పద్యము.
చం.  మదనుఁడు శంభునిన్ గెలువ మాతరొ! తా శరపంచకంబునే
పదిగనొనర్పనెంచి, తమ పాదపు వ్రేళ్ళను, బిక్కలన్ దగన్ 
మది శరపాళిగా, దొనగ, మన్ననఁ జేసె, నఖాళిముల్కులా
పదనుగఁజేయఁబడ్డ సురపాళి కిరీటపుఁ గెంపులే కనన్. ॥ 83 ॥
ప్రతిపదార్థము. 
గిరిసుతే = ఓ గిరిపుత్రీ, 
విషమ విశిఖః = విషమశరుఁడగు మన్మథుఁడు, 
రుద్రమ్ = శివుని, 
పరాజేతుమ్ = పరాజయము పాలు చేయుటకు, 
తే = నీ యొక్క, 
జంఘే = పిక్కలను,
ద్విగుణ = రెట్టింపుగా చేయబడిన,  
శర = బాణములనే, 
(సహజముగా తనకు వున్న ఐదు బాణములు రెండు రెట్లు అయినపుడు పదిబాణములు అగును) ,
గర్భౌ = లోపల నిక్షిప్తమైయుంచఁబడిన, 
నిషంగౌ = అమ్ములపొదులుగా, 
అకృత = చేసినాడు, 
బాఢమ్ = (ఇది) నిజము,
యత్‌ + అగ్రే = ఏ పిక్కల తుదను, 
పాదయుగలీ = పాదముల జంటయొక్క, 
నఖ + అగ్ర = గోళ్ళ చివరల యొక్క, 
ఛద్మానః = నెపము గలవైన, 
సుర = దేవతల యొక్క, 
మకుట = కిరీటములనెడు, 
శాణ = సాన పెట్టెడు రాళ్ళ చేత, 
ఏక నికషాః = పదును పెట్టబడినవై, 
దశ = రెండింతలు,
శర = బాణముల యొక్క, 
ఫలాః = ములుకులు, 
దృశ్యంతే = కనబడుచున్నవి.  
భావము. 
ఓ హిమగిరిసుతా! మన్మథుఁడు రుద్రుణ్ణి ఓడించటానికి తన ఐదుబాణాలు చాలవని వాటిని పదిబాణాలు చేసుకోనెంచి , నీ పిక్కలను అమ్ముల పొదులుగాను, కాలివ్రేళ్ళను బాణాలుగాను , నఖాగ్రాలను బాణాల కొనలందు పదనుబెట్టి ఉంచిన ఉక్కుముక్కలుగాను గావించుకొన్నాడు .( నమస్కరిస్తూన్న దేవతల కిరీటాలలోని మణులనే ఒరపిడి రాళ్ళచే నఖాగ్రాలనే ములుకులు పదను పెట్టబడినవి). 

84 వ శ్లోకము.  
శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతశ్శిరసి దయయా ధేహి చరణౌ |
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయోర్లాక్షాలక్ష్మీరరుణ హరిచూడామణి రుచిః ||
పదచ్ఛేదము.
శ్రుతీనామ్ -  మూర్ధానః -  దధతి -  తవ - యౌ - శేఖరతయా -
మమ - అపి -  ఏతౌ - మాతః -  శిరసి - దయయా - ధేహి - చరణౌ -
యయోః - పాద్యమ్ -  పాథః - పశుపతి - జటా - జూట - తటినీ -
యయోః -  లాక్షా - లక్ష్మీః -  అరుణ - హరి - చూడామణి - రుచిః.
అన్వయక్రమము.
మాతః, తవ, యౌ, చరణౌ, శ్రుతీనామ్, మూర్ధానః, శేఖరతయా, దధతి, యయోః, పాద్యమ్, పాథః, పశుపతి, జటాజూట, తటినీ, యయోః, లాక్షా లక్ష్మీః,అరుణ, హరి, చూడామణి, రుచిః.  ఏతౌ,  మమాఽపి , శిరసి, దయయా, ధేహి.
పద్యము.
శా.  ఏ నీ పాదములన్ ధరించు శ్రుతులే ధ్యేయంబుతో నౌదల 
న్నే నీ పాదజలంబు నెత్తిని హరుండే కల్గు నా గంగయో,
యే నీ పాదపు లత్తుకారుణము లక్ష్మీశాను రత్నాంశువో, 
యా నీ పాదములుంచు నా శిరముపై నమ్మా! కృపన్, నిత్యమున్. ॥ 84 ॥
ప్రతిపదార్థము.
మాతః = ఓ తల్లీ , 
తవ = నీ యొక్క, 
యౌ = ఏ, 
చరణౌ = పాదములను, 
శ్రుతీనామ్ = వేదముల యొక్క, 
మూర్ధానః = శిరములైన వేదాంతములు, లేదా ఉపనిషత్తులు, 
శేఖరతయా = శిరోభూషణములుగా, 
దధతి = ధరించుచున్నవో, 
యయోః = ఏ నీ చరణములకు, 
పాద్యమ్ = పాదములను కడుగు, 
పాథః = జలము, 
పశుపతి = శివుని యొక్క, 
జటాజూట = జడముడి యందలి, 
తటినీ = గంగయో, 
యయోః = ఏ చరణముల యొక్క, 
లాక్షా లక్ష్మీః = లత్తుక శోభ కలదో అది,
అరుణ = ఎఱ్ఱని, 
హరి = విష్ణువు యొక్క, 
చూడామణి = శిరోభూషణము యొక్క, 
రుచిః = కాంతియో.  
ఏతౌ = అట్టి  వీటిని, 
మమాఽపి = నా యొక్కయు, 
శిరసి = శిరస్పునందు, 
దయయా = దయతో, 
ధేహి = ఉంచుము, 
భావము. 
ఓ లోకమాతా ! ఏ నీ చరణాలకు శివుడి జటాజూటంలో వర్తించే గంగ పాదప్రక్షాళన జలం అవుతుందో , ఏ నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో , శ్రుతులశిరస్సులైన ఉపనిషత్తులు ఏ నీ పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నవో, ఓ మాతా! కృపతో కూడిన చిత్తంగల దానవైన నీవు , ఆ నీ చరణాలను నాశిరస్సుమీద కూడా ఉంచు.

85 వ శ్లోకము.  
నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో
స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్తకవతే |
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమదవన కంకేళి తరవే  ||
పదచ్ఛేదము.
నమః -  వాకమ్ -  బ్రూమః -  నయన - రమణీయాయ - పదయోః -
తవ - అస్మై - ద్వంద్వాయ - స్ఫుట - రుచి - రస - అలక్తకవతే -
అసూయతి -  అత్యంతమ్ -  యత్ -  అభిహననాయ - స్పృహయతే -
పశూనామ్ -  ఈశానః - ప్రమద - వన - కంకేళి - తరవే.
అన్వయక్రమము.
పశూనాం ఈశానః, యత్‌ అభిహననాయ, స్పృహయతే, ప్రమద వన, కంకేళి తరవే, అత్యంతం అసూయతి,  నయన, రమణీయాయ, స్ఫుట, రుచి, రస + అలక్తకవతే, పదయోః, అస్మై, ద్వంద్వాయ, నమోవాకమ్, బ్రూమః.
పద్యము.
మ.  నయనానందకరంబుగా వెలుఁగు గణ్యంబైన పారాణితో.
జయ కంకేళికిఁ దాకుటెంచి హరుఁ డీర్ష్యన్ బొంది యా పాదముల్ 
ప్రియమొప్పన్ దగులంగఁ గోరుఁ దనకున్, శ్రీదేవి! నీ పాదముల్ 
జయదంబై కృపఁ జూడ నన్నుఁ గొలుతున్ జక్కంగ నే భక్తితోన్. ॥ 85 ॥
ప్రతిపదార్థము.
పశూనాం ఈశానః = పశుపతి అయిన శివుడు, 
యత్‌ అభిహననాయ = ఏ నీ పాద యుగ్మ తాడనమును, 
స్పృహయతే = కోరుచున్నాడో, 
ప్రమదవన = ఉద్యానము నందలి, 
కంకేళి తరవే = అశోక వృక్షము కొఱకు, 
అత్యంతం అసూయతి = నీ సంచారముచే నీ పాదములు వాటికి తాకెనని వాటిపై మిక్కిలి అసూయపడుచున్నాడో,   
నయన = కన్నులకు, 
రమణీయాయ = ఇంపు గొలుపునదై, 
స్ఫుట = స్పష్టముగా ప్రకాశించు, 
రుచి = కాంతి గలదై, 
రస + అలక్తకవతే = తడి లత్తుక కలిగిన, 
పదయోః = అట్టి నీ పాదముల యొక్క, 
అస్మై = ఈ కనబడు, 
ద్వంద్వాయ = జంటకు, 
నమోవాకమ్ = నమస్కార వచనమును, 
బ్రూమః = వచించెదము, 
భావము. 
ఓ భగవతీ! లత్తుక రసంచే తడిసి కెంపుగొన్నదై , చూచువారి కనుదమ్ములకు మిగుల సొంపు నింపు గొలిపేదై చక్కగా వెలుగొందుతున్న నీ పాదద్వయానికి నమస్కరిస్తున్నాం. పశుపతి ఐన శివుడు ఏనీ పాదపద్మ తాడనాన్ని కోరుతూ , ఆతాడన భాగ్యానికి నోచుకునే అలరుల తోటలోని అశోకవృక్షాన్ని గాంచి దానిపై అసూయపడుతున్నాడో అట్టి నీ చరణారవిందాలకు నమస్కరిస్తున్నాను.
జైహింద్.

సౌందర్య లహరి 76 - 80 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.
76 వ శ్లోకము.  
హరక్రోధజ్వాలావలిభిరవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసఙ్గో మనసిజః |
సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి  ||
పదచ్ఛేదము.
హర - క్రోధ - జ్వాలా - వలిభిః - అవలీఢేన - వపుషా -
గభీరే - తే - నాభీ - సరసి -  కృత - సఙ్గః - మనసిజః -
సముత్తస్థౌ -  తస్మాత్ -  అచల తనయే - ధూమ -  లతికా -
జనస్తామ్ -  జానీతే - తవ - జనని -  రోమావలిః -  ఇతి.
అన్వయక్రమము.
అచలతనయే, మనసిజ, హర, క్రోధ, జ్వాలా, ఆవలిభిః, అవలీఢేన, వపుషా, గభీరే, తే, నాభీ, సరసి, కృతసంగః,  తస్మాత్‌, ధూమలతికా, సముత్తస్థౌ, జనని, తామ్, జనః, తవ, రోమావలిః ఇతి, జానీతే.
పద్యము.
శా.  శ్రీమాతా! మదనుండు దగ్ధమగుచున్ శ్రీశంభు కోపాగ్నిలో
నీమంబొప్పగ రక్షకై దుమికెఁ దా నీ నాభి సత్రమ్ములో,
ధీమంతుండు ప్రశాంతిఁబొందె శిఖి శాంతింపన్ బొగల్ వెల్వడెన్
ధూమంబున్ గనుగొంచు నెంచితది నీ నూగారుగా శాంభవీ! ॥ 76 ॥
ప్రతిపదార్థము.
జనని = అమ్మా,
అచలతనయే = ఓ పార్వతీ, 
మనసిజ = మన్మథుడు, 
హర = శివుని యొక్క, 
క్రోధ = క్రోధము అను, 
జ్వాలా = అగ్ని వలన జనించిన జ్వాలల యొక్క, 
ఆవలిభిః = సమూహము చేత, 
అవలీఢేన = క్రమ్మబడిన, 
వపుషా = శరీరముతో, 
గభీరే = లోతైన, 
తే= నీ యొక్క, 
నాభీ = బొడ్డు అను ,
సరసి = సరస్సునందు, 
కృతసంగః = కూడిన వాడయ్యెను, అనగా  మునిగిన వాడయ్యెను,  
తస్మాత్‌ = అందువలన ఆ బొడ్డు అను కొలను నుండి, 
ధూమలతికా = పొగతీగ, 
సముత్తస్థౌ = పైకి ప్రాకెను, 
తామ్ = ఆ పొగతీగను, 
జనః = జనము, 
తవ = నీ యొక్క, 
రోమావలిః ఇతి = నూగారు అని, 
జానీతే = తెలుసుకొనుచున్నారు. 
భావము. 
అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా!
77 వ శ్లోకము.  
యదే తత్కాళిందీ తనుతర తరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్
విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్  ||
పదచ్ఛేదము.
యత్ -  ఏతత్ -  కాళిందీ - తనుతర - తరంగ - ఆకృతి - శివే -
కృశే - మధ్యే - కించిత్ -  జనని - తవ - యత్ -  భాతి - సుధియామ్ -
విమర్దాత్ -  అన్యోన్యమ్ -  కుచ - కలశయోః -  అంతరగతమ్ -
తనూ భూతమ్ -  వ్యోమ - ప్రవిశత్ -  ఇవ - నాభిమ్ -  కుహరిణీమ్.
అన్వయక్రమము.
జనని, శివే, కృశే, తవ, మధ్యే, యత్‌ యేతత్, కాళిందీ, తనుతర, తరంగ, ఆకృతి, యత్, కించిత్‌, తవ, కుచకలశయోః, అన్యోన్యమ్, విమర్దాత్‌, అంతరగతమ్, వ్యోమ, తనూభూతమ్, కుహరిణీమ్, నాభిమ్, ప్రవిశత్‌ + ఇవ, సుధియామ్, భాతి, 
పద్యము.
మ.  ఉమ! నీదౌ కృశమధ్య నే యమున శుష్కోర్మ్యాకృతిన్గల్గి కొం
చెము ధీయుక్తుల కేది దివ్యముగ భాసించున్ మహోద్ఘట్ట వి
భ్రమవక్షోజ గతాభ్రమెన్నఁ గృశమై స్వాంతోపమంబౌ యుదా
నమునే చేరు విధంబునొప్పెనది, యో జ్ఞానప్రదా! కాంచినన్.  ॥ 77 ॥
ప్రతిపదార్థము.
జనని = జగజ్జననీ! 
శివే = ఓ భగవతీ !
కృశే = సన్ననైన, 
తవ = నీ యొక్క, 
మధ్యే = నడుము భాగము నందు, 
యత్‌ యేతత్ = ఏ యీ, 
కాళిందీ = యమునా నదియొక్క, 
తనుతర = మిక్కిలి చిన్నదియైన, 
తరంగ = అలవంటి, 
ఆకృతి = రూపు గలదై, 
యత్ = ఏ,
కించిత్‌ = కొంచెముగా కనబడు నూగారు, 
తవ = నీ యొక్క, 
కుచకలశయోః = కుచ కుంభములు, 
అన్యోన్యమ్ = పరస్పరము, 
విమర్దాత్‌ = ఒరసి కొనునట్లు స్పృశించుకొనుట వలన, 
అంతరగతమ్ = మధ్య భాగమున వర్తించునదైన, 
వ్యోమ = ఆకాశము, 
తనూభూతమ్ = సన్ననిదై, 
కుహరిణీమ్ = గుహవంటిదైన, 
నాభిమ్ = బొడ్డును, 
ప్రవిశత్‌ + ఇవ = ప్రవేశించుచున్నది వలె ,
సుధియామ్ = విద్వాంసులకు, 
భాతి = ప్రకాశించుచు కనబడుచున్నది, 
భావము. 
ఓ భగవతీ! యమునానదీ తరంగంవలె సన్ననిదై, నీ కృశమధ్యంలో అగపడే నూగారనే చిన్నవస్తువు విద్వాంసులకు - నీ కుచముల మధ్యనున్న ఆకాశం ఆకుచములురెండు పరస్పరం ఒరయటం వల్ల ఆఒరపిడికి తాళలేక నలిగినల్లనై సన్నగా క్రిందికి నాభివరకు జారినదిగా ప్రకాశించుచు కనబడుచున్నది.
78 వ శ్లోకము.  
స్థిరో గంగా వర్తస్స్తనముకుళ రోమావళి లతా
కలావాలం కుండం కుసుమశర తేజో హుతభుజః |
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే  ||
పదచ్ఛేదము.
స్థిరః -  గంగా - ఆవర్తః - స్తన - ముకుళ  - రోమ - ఆవళి - లతా -
కల - ఆవాలమ్ -  కుండమ్ -  కుసుమ శర - తేజః -  హుతభుజః -
రతేః - లీలాగారమ్ -  కిమపి - తవ - నాభిః - గిరి - సుతే -
బిల - ద్వారమ్ -  సిద్ధేః - గిరిశ - నయనానామ్ -  విజయతే.
అన్వయక్రమము.
గిరిసుతే, తవ, నాభిః, స్థిరః, గంగా, ఆవర్తః, స్తన, ముకుళ, రోమావళి, లతా, కలా, ఆవాలమ్,  కుసుమశర, తేజః, హుతభుజః, కుండమ్, రతేః, లీలాగారమ్, గిరిశ, నయనానామ్, సిద్ధేః, బిలద్వారమ్, కిమపి, విజయతే.
పద్యము.
ఉ.  నీదగు నాభి, గాంగ నుతనిర్ఝరలో సుడి, గుబ్బమొగ్గలన్
మోదము నిల్పు రోమలత మూలము, మన్మథ కాంతివహ్నికిన్
బాదగునగ్నికుండ, మనవద్యరతీగృహ మాత్రిశూలికిన్
శ్రీద సునేత్రపర్వ గుహసీమపు ద్వారమవర్ణ్యమమ్మరో! ॥ 78 ॥
ప్రతిపదార్థము.
గిరిసుతే = ఓ పార్వతీమాతా, 
తవ = నీ యొక్క, 
నాభిః = బొడ్డు, 
స్థిరః = స్థిరముగా నున్న, 
గంగా= గంగానది యొక్క ,
ఆవర్తః = సుడి, 
స్తన = స్తనములు అను, 
ముకుళ = పూల మొగ్గలకు ఆధారమైన, 
రోమావళి = నూగారు అను, 
లతా = తీగయొక్క, 
కలా = రేఖకు,
ఆవాలమ్ = పాదు,  
కుసుమశర = మన్మథుని యొక్క, 
తేజః = ప్రకాశమనెడి,
హుతభుజః = అగ్నికి, 
కుండమ్ = హోమగుండము, 
రతేః = రతీదేవికి, 
లీలాగారమ్ = విలాసగృహము, 
గిరిశ  = సదాశివుని,  
నయనానామ్ = కన్నుల యొక్క,
సిద్ధేః = తపస్సు సిద్ధించుటకు, 
బిలద్వారమ్ = గుహద్వారము, 
కిమపి = ఏమని వర్ణించుటకును వీలు కానిదై, 
విజయతే = సర్వోత్కృష్టముగా భాసిల్లుచున్నది. 
భావము. 
ఓ హిమగిరికన్యకా ! నీ నాభి చలనంలేని గంగానది నీటి సుడిగాను , పాలిండ్లనే పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగయొక్క పాదుగాను , మన్మథుడి తేజస్సనే అగ్నికి హోమకుండంగాను , మరుని చెలువ ఐన రతీదేవికి శృంగారభవనంగాను , నీ పతి ఐన సదాశివుడి నయనాల తపస్సిధ్ధికి గుహాద్వారమై , అనిర్వాచ్యమై , అతిసుందరమై సర్వోత్కర్షతో ప్రకాశించుచున్నది.
79 వ శ్లోకము.  
నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ |
చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ తీర తరుణా
సమావస్థా స్థేమ్నో భవతు కుశలం శైలతనయే  ||
పదచ్ఛేదము.
నిసర్గ - క్షీణస్య -  స్తన - తట - భరేణ - క్లమజుషః -
నమత్ -  మూర్తేః -  నారీ - తిలక - శనకైః -  త్రుట్యత - ఇవ |
చిరమ్ -  తే - మధ్యస్య -  త్రుటిత - తటినీ - తీర - తరుణా -
సమ - అవస్థా - స్థేమ్నః -  భవతు - కుశలమ్ -  శైల - తనయే.
అన్వయక్రమము.
నారీ తిలక, హే శైల తనయే,   నిసర్గ, క్షీణస్య, స్తనతట, భరేణ,  క్లమజుషః, నమత్‌, మూర్తేః, శనకైః, త్రుట్యత ఇవ, త్రుటిత, తటినీ, తీర, తరుణా, సమ, అవస్థా, స్థేమ్నః, తే, మధ్యస్య, చిరమ్, కుశలమ్, భవతు.
పద్యము.
ఉ.  శైలతనూజ! నీ నడుము చక్కని నీ స్తనభారమోపమిన్
బేలవమై కృశించి జడిపించును దా విఱుగంగనున్నటుల్
వాలిన యేటిగట్టుపయి వాలిన చెట్టును బోలి, నీకికన్
మేలగుగాత, నీ నడుము మేలుగ వర్ధిలుగాక నిచ్చలున్. ॥ 79 ॥
ప్రతిపదార్థము.
నారీ తిలక = స్త్రీ రత్నమైన, 
హే శైల తనయే = ఓ గిరిపుత్రీ,   
నిసర్గ = స్వభావసిద్ధముగనే, 
క్షీణస్య = కృశించినదియు, 
స్తనతట = కుచప్రదేశముయొక్క, 
భరేణ = బరువుచే,  
క్లమజుషః = బడలినదియు, 
నమత్‌ = వంగిన ,
మూర్తేః = రూపము గలదియు, 
శనకైః = కొంచెముగా, 
త్రుట్యత ఇవ = తెగిపోవుచున్నదో అనునట్లున్నదియు,
త్రుటిత = ఒడ్డు విఱిగిన, 
తటినీ = నది యొక్క, 
తీర = గట్టునందలి, 
తరుణా = వృక్షముతో, 
సమ = సమానమగు, 
అవస్థా = అవస్థలో, 
స్థేమ్నః = నిలకడగా నున్న, 
తే = నీ యొక్క, 
మధ్యస్య = నడుమునకు, 
చిరమ్ = కలకాలము, 
కుశలమ్ = క్షేమము, 
భవతు = అగుగాక.
భావము. 
ఓ శైలతనయా ! ఓ నారీ తిలకమా ! సన్ననిదీ , పాలిండ్ల భారంచేత బడలినదీ క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నదీ , కట్టతెగిన ఏటిగట్టునందలి చెట్టుతో సమానమైన స్థితిని పొందినదీ , ఐన నీ నడుము చిరకాలం సురక్షితంగా ఉండుగాక.
80 వ శ్లోకము.  
కుచౌ సద్యస్స్విద్యత్తట ఘటిత కూర్పాస భిదురౌ
కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా |
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధం దేవీ త్రివళి లవలీవల్లిభిరివ  || 
పదచ్ఛేదము.
కుచౌ - సద్యః -  స్స్విద్యత్ -  తట - ఘటిత - కూర్పాస - భిదురౌ -
కషంతౌ - దోః - మూలే - కనక - కలశ - అభౌ కలయతా -
తవ - త్రాతుమ్ -  భంగాత్ - అలం - ఇతి -  వలగ్నమ్ -  తను - భువా - 
త్రిధా - నద్ధమ్ -  దేవీ - త్రివళి - లవలీ - వల్లిభిః - ఇవ.
అన్వయక్రమము.
దేవి, సద్యః, స్విద్యత్‌, తట, ఘటిత, కూర్పాస, భిదురౌ, దోర్మూలే, కషంతౌ, కనక + కలశ + ఆభౌ, కుచౌ, కలయతా, తనుభువా, భంగాత్‌, త్రాతుమ్, అలమితి, తవ, వలగ్నమ్, త్రివళి, లవలీ వల్లిభిః, త్రిధా, నద్ధం ఇవ.
పద్యము.
చం.  చెమరుచు నీదు పార్శ్వములఁ జీలునొ చోలమనంగ నొత్తు నీ
విమల పయోధరంబులను విస్తృతిఁ గొల్పెడి మన్మథుండు భం
గము కలిగింపరాదను గౌనునకున్ లవలీ త్రివల్లులన్
సముచితరీతిఁ గట్టినటు చక్కగ నొప్పుచు నున్నదమ్మరో! ॥ 80 ॥
ప్రతిపదార్థము.
దేవి = ఓ దివ్యమంగళ స్వరూపిణీ, 
సద్యః = ఎప్పటికప్పుడే, 
స్విద్యత్‌ = (ఈశ్వరిని తలంపుచే)చెమర్చుచున్న, 
తట = పార్శ్వములందు, 
ఘటిత = తొడగఁబడిన, 
కూర్పాస = రవికను, 
భిదురౌ = పిగిల్చుచున్నవియు, 
దోర్మూలే = బాహువుల మూలములను, 
కషంతౌ = ఒఱియుచున్న, 
కనక + కలశ + ఆభౌ = బంగారు కడవల ప్రభతో ఒప్పు, 
కుచౌ = స్తనములను, 
కలయతా = నిర్మించుచున్న, 
తనుభువా = మన్మథుని చేత, 
భంగాత్‌ = అపాయము నుండి, 
త్రాతుమ్ = కాపాడుటకు, 
అలమితి = చాలునని,
తవ = నీ యొక్క, 
వలగ్నమ్ = నడుము, 
త్రివళి = మూడు ముడుతలు అనెడి, 
లవలీ వల్లిభిః = ఏలకి తీగల చేత, 
త్రిధా = ముప్పేటలుగా, 
నద్ధం ఇవ = కట్టబడినదియా అన్నట్లున్నది.  
భావము. 
ఓ ప్రకాశించే రూపుగల దేవీ! ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వములలో అంటుకొనియున్న రవికెను పిగుల్చుచున్నవీ , బాహుమూలల సమీప ప్రదేశాలను ఒరయుచున్నవీ, బంగారుకలశంవలె ఒప్పారుచున్నవీ ఐన కుచములను నిర్మిస్తూన్న మన్మథుఁడు, యీ (స్తన భారంవల్ల) భంగం కలుగరాదని నడుమును కాపాడటానికి లవలీ లతలతోముప్పేటగా కట్టబడెనా అన్నట్లు నీ పొట్టమీద మూడుముడతలు తోచుచున్నవి.
జైహింద్.