96 వ శ్లోకము.
కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః ||
పదచ్ఛేదము.
కళత్రమ్ - వైధాత్రమ్ - కతి - కతి - భజంతే - న- కవయః -
శ్రియః - దేవ్యాః - కః - వా - న - భవతి - పతిః - కైః - అపి - ధనైః -
మహాదేవమ్ - హిత్వా - తవ - సతి - సతీనామ్- అచరమే -
కుచాభ్యామ్ - ఆసంగః - కురవక - తరోః - అపి - అసులభః.
అన్వయక్రమము.
సతి, వైధాత్రమ్, కళత్రమ్, కతికతి, కవయః, న భజంతే, శ్రియః దేవ్యా, కైః అపి ధనైః, కోవా, పతిః, నభవతి, సతీనాం అచరమే, మహాదేవమ్, హిత్వా, తవ, కుచాభ్యామ్, ఆసంగః, కురవక తరోః అపి, అసులభః.
పద్యము.
సీ. బ్రహ్మరాజ్ఞిని గొల్చి భవ్య సత్ కవులయి వాణీ పతులటంచుఁ బరగువారు,
శ్రీలక్ష్మినే గొల్చి శ్రీదేవి కృపచేత ధనికులై పేరొంది ధనపతులుగ
వెలుఁగువారు కలరు, విశ్వేశుఁడొక్కఁడే పార్వతీపతియని ప్రబలు ధాత్రి,
పతిని వీడక నిత్యమతనినే యెదనిల్పి పరవశించెడి నిన్ను బడయనేర
తే.గీ. దవని కురవకమయిననో యమ్మ! నీదు
నెదను పులకించు భాగ్యము నిందువదన!
నీదుపతిఁగూడి యున్న నిన్ నాదు మదిని
నిలిపి పులకింపనిమ్మిలన్ నిత్యముగను! ॥ 96 ॥
ప్రతిపదార్థము.
సతి = ఓ పార్వతీ,
వైధాత్రమ్ = విధాతకు సంబంధించినదైన,
కళత్రమ్ = భార్య అయిన సరస్వతిని,
కతికతి = ఎందరెందఱు,
కవయః = కవులు,
న భజంతే = సేవించుట లేదు?(సేవించుచుండిరి),
శ్రియః దేవ్యా = లక్ష్మిదేవి యొక్క,
కైః అపి ధనైః = ఏదో కొంత ధనము చేత ,
కోవా = ఏ పురుషుడు,
పతిః = ధనపతి,
నభవతి = కాకున్నాడు?(ధనపతి అగుచున్నాఁడు)
సతీనామ్ అచరమే = పతివ్రతలలో అగ్రగణ్యమైన దేవీ!
మహాదేవమ్ = సదాశివుని,
హిత్వా = వీడి,
తవ = నీ యొక్క,
కుచాభ్యామ్ = స్తనయుగము చేతనైన,
ఆసంగః = కౌగిలింత,
కురవక తరోః అపి = గోరంట చెట్టునకు సైతము,
అసులభః = సులభము కాదు.
భావము.
ఓ పతివ్రతా శిరోమణీ! పార్వతీ! బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరెందరు కవులు సేవింపకున్నారు? లక్ష్మీదేవి యొక్క ధనసంపదలను పొంది ఏ పురుషుడు ధనపతి కాకున్నాడు? కాని పతివ్రతలలో మొట్టమొదట లెక్కింపదగిన దేవీ! నీ స్తనయుగముతోడి కౌగిలింత ఆ సదాశివునికి ఒకనికే తప్ప గోరంట చెట్టుకు గూడా లభించదు కదా!
97 వ శ్లోకము.
గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయామ్ |
తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ||
పదచ్ఛేదము.
గిరామ్ - ఆహుః - దేవీమ్ - ద్రుహిణ - గృహిణీమ్ - ఆగమ - విదః -
హరేః - పత్నీమ్ - పద్మామ్ - హర - సహచరీమ్ - అద్రి - తనయామ్ -
తురీయా - కాపి - త్వమ్ - దుర్ - అధిగమ - నిస్సీమ - మహిమా -
మహా - మాయా - విశ్వమ్ - భ్రమయసి - పరబ్రహ్మ - మహిషి.
అన్వయక్రమము.
పరబ్రహ్మమహిషి, ఆగమవిదః, త్వాం ఏవ, దృహిణ గృహిణీమ్, గిరాందేవి, ఆహుః, త్వాం ఏవ, హరేః, పత్నీమ్, పద్మామ్, ఆహుః, త్వమేవ, హరసహచరీమ్, అద్రితనయామ్, ఆహుః, త్వమ్, తురీయా, కాపి, దురధిగమ, నిస్సీమ, మహిమా, మహామాయా, విశ్వమ్, భ్రమయసి.
పద్యము.
శా. నిన్నేబ్రహ్మకుఁ బత్నిగాఁ దలచుచున్ నిత్యంబు సేవింతు రా
నిన్నే విష్ణుని పత్నిగాఁ గొలుచుచున్ నేర్పార పూజింతు రా
నిన్నే శంభుని పత్నిగాఁ దలతురే నిత్యంబు వేదజ్ఞు లే
మన్నన్ వేరగు శక్తి వీ జగతి మోహభ్రాంతులన్ గొల్పుదే. ॥ 97 ॥
ప్రతిపదార్థము.
పరబ్రహ్మ మహిషి = ఓ సదాశివుని పట్టమహిషీ ,
ఆగమ విదః = వేద రహస్యార్థములు తెలిసిన వారు,
త్వాం ఏవ = నిన్నే,
దృహిణ గృహిణీమ్ = బ్రహ్మ ఇల్లాలైన,
గిరాందేవి = వాగ్దేవి అయిన సరస్వతినిగా,
ఆహుః = వచింతురు,
త్వాం ఏవ = నిన్నే,
హరేః = విష్ణువు యొక్క,
పత్నీమ్ = భార్య అయిన,
పద్మామ్ = కమలవాసిని అయిన లక్ష్మీదేవిగా,
ఆహుః = చెప్పుదురు,
త్వమేవ = నిన్నే,
హర సహచరీమ్ = శివుని సహధర్మచారిణి అయిన,
అద్రితనయామ్ = పార్వతిగా,
ఆహుః = చెప్పుదురు,
త్వమ్ = నీవు,
తురీయా = ఆ మువ్వురి కంటె నాల్గవ ఆమెయగు బ్రహ్మమై,
కాపి = ఇట్టిదని చెప్పనలవి కాని,
దురధిగమ = పొందనలవి కాని,
నిస్సీమ = హద్దులేని,
మహిమా = ప్రభావము కలదైన,
మహామాయా = గొప్ప మాయాతత్త్వమగుచు,
విశ్వమ్ = ఈ జగత్తును,
భ్రమయసి = భ్రమింప చేయుచున్నావు.
భావము.
ఓ పరబ్రహ్మ పట్టపుదేవీ! ఆగమవిదులు నిన్నే బ్రహ్మ పత్నివైన సరస్వతి అంటారు. నిన్నే శ్రీహరి పత్ని లక్ష్మి అంటారు. నిన్నే హరుని సహచారిణి ఐన గిరితనయ అంటారు. కానీ నువ్వు ఈ మువ్వురి కంటే వేరై నాల్గవదేవియై ఇట్టిదట్టిదని వచింప నలవిగాని ఆమెవై అనిర్వాచ్యవై, దేశ కాల వస్తువులకు అపరిచ్ఛిన్నవై, భేదించరాని మహాప్రభావం కలిగినదానవై, శుద్ధవిద్యలో అంతర్గతమైన మహామాయవై, మాయాతత్త్వ మవుతూ ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా మోహ పెట్టుతున్నావు.
98 వ శ్లోకము.
కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజన జలమ్ |
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
కదాధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతామ్ ||
పదచ్ఛేదము.
కదా - కాలే - మాతః - కథయ - కలితా - లక్తక - రసమ్ -
పిబేయమ్ - విద్యార్థీ - తవ - చరణ - నిర్ణేజన - జలమ్ -
ప్రకృత్యా - మూకానామ్ - అపి - చ - కవితా - కారణతయా -
కదా - ధత్తే - వాణీ - ముఖ - కమల- తాంబూల - రసతామ్.
అన్వయక్రమము.
మాతః, కలిత + అలక్తక రసమ్, తవ, చరణ నిర్ణేజన జలమ్, విద్యార్థీ, అహమ్, కదాకాలే, పిబేయమ్, తచ్చ, ప్రకృత్యా, మూకానామ్ అపి, కవితా కారణతయా, వాణీ, ముఖ కమలమ్, తాంబూల రసతామ్, కదా, ధత్తే, కథయ.
పద్యము.
శా. శ్రీలన్ జిందు కవిత్వమొందగను నిన్ సేవించు విద్యార్థినే,
నీ లాక్షారస యుక్త పాదజలమున్ నే గ్రోలగానెప్పుడౌన్?
జాలున్ మూకకుఁ బల్కుశక్తినిడుచున్ సద్గీతమల్లింప నా
మేలౌ శారద వీటిఁ బోలు రయి భూమిన్ నాకదెట్లబ్బునో? ॥ 98 ॥
(రయి = నీరు)
ప్రతిపదార్థము.
మాతః = ఓ తల్లీ ,
కలిత + అలక్తక రసమ్ = లత్తుకరసము గలదైన,
తవ = నీ యొక్క,
చరణ నిర్ణేజన జలమ్ = పాదములు కడిగిన ఉదకమును,
విద్యార్థీ = బ్రహ్మ విద్యనర్థించువాఁడనయిన,
అహమ్ = నేను,
కదాకాలే = ఎప్పుడు,
పిబేయమ్ = త్రాగుదునో,
తచ్చ = ఆ జలము,
ప్రకృత్యా = స్వభావముచేతనే,
మూకానామ్ అపి = మూగ వారలకు సహితము,
కవితా కారణతయా = కవిత్వ రచన గావించుటకు కారణమైన దగుటచేత,
వాణీ = సరస్వతి యొక్క,
ముఖ కమలమ్ = ముఖ పద్మము నందలి,
తాంబూల రసతామ్ = తాంబూల రసము సారస్యమును,
కదా = ఎప్పుడు,
ధత్తే = ధరించుచున్నదో.
కథయ = చెప్పుము.
భావము.
తల్లీ! జగజ్జననీ! స్వాభావికముగానే – చెవిటివారికి వినికిడి శక్తిని, మూగవారికి మాట్లాడుశక్తిని కలిగించునదై, పూర్వానుభవము, సామర్థ్యము లేకున్నా కవిత్వరచనా సౌభాగ్యమును ప్రసాదించునదై, సరస్వతీదేవి తాంబూల రసము వంటిదగు లత్తుకరసముతో కలసిన నీ పాద ప్రక్షాళన జలమును- విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలుదునో చెప్పుము.
99 వ శ్లోకము.
సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా |
చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ ||
పదచ్ఛేదము.
సరస్వత్యా - లక్ష్మ్యా - విధి - హరి - సపత్నః - విహరతే -
రతేః - పాతివ్రత్యమ్ - శిథిలయతి - రమ్యేణ - వపుషా -
చిరమ్ - జీవన్ - ఏవ - క్షపిత - పశు - పాశ - వ్యతికరః -
పర - ఆనంద - అభిఖ్యం - రసయతి - రసమ్ - త్వత్ - భజనవాన్.
అన్వయక్రమము.
త్వత్ + భజనవాన్, సరస్వత్యా, లక్ష్మ్యా, విధి హరి, సపత్నః, విహరతే, రమ్యేణ, వపుషా, రతేః, పాతివ్రత్యమ్, శిధిలయతి, చిరమ్, జీవన్నేవ, క్షపిత, పశు, వ్యతికరః, పరానంద + అభిఖ్యమ్, రసమ్, రసయతి.
పద్యము.
మ. నిను సేవించెడివాఁడు దివ్య ధనుఁడై, నిష్ణాతుఁడై విద్యలన్,
ఘనుఁడౌ బ్రహ్మకుఁ, బద్మగర్భునకుఁ, గాక న్నీర్ష్యచేఁ గొల్పుఁ , దాఁ
దనువున్ దీప్తిని గల్గి యా రతి పునీతన్ మార్చు, నిస్సారమౌ
తనువున్ వీడి ప్రశస్త ముక్తిని గొనున్ దా సాంబునే దల్చుచున్. ॥ 99 ॥
ప్రతిపదార్థము.
(జగజ్జననీ! = ఓ లోకమాతా!)
త్వత్ + భజనవాన్ = నిన్నుసేవించు భక్తుడు,
సరస్వత్యా = వాగ్దేవి తోడను,
లక్ష్మ్యా = లక్ష్మీదేవితోడను గూడిన,
విధి హరి = వరుసగా బ్రహ్మకు విష్ణువునకును,
సపత్నః = పోటీదారుఁడగుచు,
విహరతే = విహరించుచున్నవాఁడై,
రమ్యేణ = అతిసుందరమైన,
వపుషా = శరీరము చేత,
రతేః = రతీదేవి యొక్క,
పాతివ్రత్యమ్ = పతివ్రతా ధర్మమును,
శిధిలయతి = సడలింప జేయుచున్నవాడై,
చిరమ్ = తడవుగా,
జీవన్నేవ = బ్రతికి యుండినవాఁడై,
క్షపిత = విదళింపబడిన,
పశు = జీవుల యొక్కయు, అవిద్య యొక్కయు,
వ్యతికరః = సంబంధము కలవాడై,
పరానంద + అభిఖ్యమ్ = బ్రహ్మానందము అనఁబడు,
రసమ్ = సుఖమును,
రసయతి = ఆస్వాదించుచున్నాడు.
భావము.
అమ్మా ఓ భగవతీ ! నిన్ను ఉపాసించువారు , సరస్వతీ దేవినీ (సర్వవిద్యలను)లక్ష్మీదేవినీ(సర్వసంపదలను ) పొంది వాళ్ళభర్తలైన బ్రహ్మవిష్ణువులకు వైరిగా మారుతున్నారు . రమ్య శరీరంచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. పశుతుల్య శరీరాన్ని తొలగించుకొని, జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్త్వాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు.
100 వ శ్లోకము.
ప్రదీప జ్వాలాభిర్దివసకరనీరాజనవిధి
స్సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా |
స్వకీయైరంభోభిస్సలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్ ||
పదచ్ఛేదము.
ప్రదీప - జ్వాలాభిః - దివస కర - నీరాజన - విధిః -
సుధాసూతేః - చంద్ర - ఉపల - జల - లవైః - అర్ఘ్య - రచనా -
స్వకీయైః - అంభోభిః - సలిల - నిధి - సౌహిత్య - కరణమ్ -
త్వదీయాభిః - వాగ్భిః - తవ - జనని - వాచామ్ - స్తుతిః - ఇయమ్.
అన్వయక్రమము.
వాచాం జనని, యథా, స్వకీయాభిః, ప్రదీప జ్వాలాభిః, దివస కర, నీరాజన విధిః, యథా, స్వకీయైః, చంద్ర + ఉపజల లవైః, సుధా సూతేః, అర్ఘ్య రచనా, యథా, స్వకీయైః, అంభోభిః, సలిల నిధి, సౌహిత్య కరణమ్, త్వదీయాభిః, వాగ్భిః, తవ, ఇయమ్, స్తుతిః, తథా.
పద్యము.
సీ. నే చేతి దివిటీల నీరాజనంబును సూర్యదేవునికిచ్చుచొప్పు కనఁగ,
శశికాంతిశిలనుండి జాలువారెడి బిందు జలములనర్ఘ్యంబు శశికొసంగు
నట్లుదకంబులనర్ఘ్యంబు దధికిచ్చినట్టుల నీ నుండి యిట్టులేను
నిరుపమా! పొడమిన నిరుపమ వాగ్ఘరిన్ నిను నుతియించుచున్ నిలిచియుండి,
తే.గీ. ధన్య జీవుఁడనయితి సౌందర్యలహరి
శంకరులు వ్రాయఁ దెలిఁగించి, శాశ్వతమగు
ముక్తి, సత్కీర్తి, నొసఁగెడి శక్తి! జనని!
యంకితము చేసితిని నీకు నందుకొనుము. ॥ 100 ॥
ప్రతిపదార్థము.
వాచాంజనని = వాక్ ప్రపంచమునకు తల్లీ,
యథా = ఏ విధముగా,
స్వకీయాభిః = తనకు సంబంధించినవే అయిన,
ప్రదీపజ్వాలాభిః = చేతి దివిటీల యొక్క జ్వాలలచే,
దివస కర = సూర్యునికి,
నీరాజనవిధిః = కర్పూరహారతి నిచ్చుటయో,
యథా = ఏ విధముగా,
స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన,
చంద్ర + ఉపజలలవైః = స్రవించు చంద్రకాంత శిలా జల బిందువులచేత,
సుధాసూతేః = చంద్రునికి,
అర్ఘ్య రచనా = అర్ఘ్యము సమర్శించుటయో,
యథా = ఏ ప్రకారము,
స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన,
అంభోభిః = జలముల చేత,
సలిల నిధి = సముద్రునకు,
సౌహిత్య కరణమ్ = తృప్తికొఱకు తర్పణము చేయుటయో,
త్వదీయాభిః = నీ వలన ఉత్పన్నములైన,
వాగ్భిః = వాక్కుల చేత,
తవ = నీకు,
ఇయమ్ = ఈ ,
స్తుతిః = సోత్రము,
తథా = ఆ ప్రకారము, అగుచున్నది.
భావము.
ఓ భగవతీ! స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలలచేత సూర్యుడికి ఆరతి గావిస్తూన్నట్లు చంద్రకాంత శిలనుండి స్రవిస్తూన్న జలబిందువులచేత చంద్రుడికి అర్ఘ్యము సమర్పిస్తూన్నట్లూ, ఉదకాలచే సముద్రుడికి తృప్తికారణమైన తర్పణం కావిస్తూన్నట్లూ , నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్తుతిస్తున్నాను.
*సౌందర్యలహరి స్తోత్రం సంపూర్ణమ్*
O2 . 11 . 2022 To 01 . 6 . 2023.
శా. శ్రీమన్మంగళ శాంభవీజనని నా చిత్తంబులోఁ బ్రేరణన్
బ్రేమన్ గొల్పగఁ, దెల్గు పద్యములుగా విఖ్యాతిగా మార్చితిన్
సామోద్భాసిత మాతృ రూప విలసత్ సౌందర్య సద్వీచికన్,
శ్రీమన్మంజులభావపాఠకులకున్ శ్రేయంబు గూర్పన్ సదా.
ఫలశ్రుతి
శా. శ్రీమన్మంగళ శాంభవీ! లలిత! హృచ్ఛ్రీచక్ర సంచారిణీ!
సామాన్యుల్ కన నే రచించిన కృతిన్ సౌందర్య సద్వీచికన్
క్షేమంబొందఁ బఠింపఁగాఁ దలతు రా చిన్మార్గులన్ బ్రోవుమా,
నీ మంత్రాక్షరి పాఠకాళికిడుమా నిర్వాణ సంపత్ప్రభల్.
భావము. శ్రీమన్మంగళస్వరూపిణివైన ఓ భవానీ! ఓ లలితా మాతా! హృదయమునందలి శ్రీచక్రమున సంచరించు జననీ!సామాన్యులు సహితము గ్రహించుటకు వీలుగా నేను రచించిన ఈ ఆంధ్ర సౌందర్యలహరిని, క్షేమము పొందుట కొఱకు చదువుచుండెడి తేజోమూర్తులైన భక్తులను కాపాడుచుండుము. నీకు సంబంధించిన యీ మంత్రాక్షరస్వరూపము నిర్వాణ సంపత్ప్రభలను పాఠకులకు ప్రసాదించుగాక.
నివేదన
శా. శ్రీమాతా! వరలోకపావని! సతీ! చింతాన్వయుండన్, భవత్
ప్రేమన్ గాంచెడి రామకృష్ణను, జగద్విఖ్యాత సౌందర్యమన్
ధీమచ్ఛంకర సత్ కృతిన్ లహరినే తెన్గించితిన్ శ్రీసతీ!
క్షేమంబున్ గలిగింప పాఠకులకున్ చిద్రూపిణీ! కావుమా.
భావము. శ్రీమాతా! ఓ లోకపావనీ! సతీజననీ! నేను చింతా వంశసంభవుఁడను. నీ ప్రేమను పొందిన భాగ్యశాలినైన రామకృష్ణారావు నామధేయుఁడను. ధీమంతులైన శంకరభగవత్పాదులవారు రచించిన లోక ప్రసిద్ధమయిన సౌందర్యలహరిని పాఠకులకు క్షేమమును కలిగించు నిమిత్తము నేను నీ కృపతో తెలుఁగు పద్యములలోనికనువదించితిని. ఓ చిద్రూపిణీ! కాంచుము తల్లీ!
అంకితము.
ఉ. సాకల్యంబుగఁ దెల్గులో మలచితిన్ సౌందర్య సద్వీచికన్
నీకే యంకితమిత్తునమ్మ! కొనుమా! నీవే కృపన్ దీని, నో
శ్రీ కల్యాణి! భవాంబుధిన్ గడపుమా, చిత్తంబునందుండుమా,
నీకున్ మ్రొక్కెద భక్తితోడను భవానీ! సమ్మతిన్ గాంచుమా!
భావము. ఓ భవానీమాతా! సౌందర్యలహరిని నేను క్షుణ్ణముగా పరిశీలించి తెలుఁగు పద్యమ్యులుగా మలచినాడను. ఓ కల్యాణీ! ఈ గ్రంథమును నీకే అంకితముగా సమర్పించుదును తల్లీ! నీవే కృపతో ఈ గ్రంథమును స్వీకరింపుమమ్మా! నన్ను భవాంబుధినుండి దాటించుము. నీవు నా హృదయములో ఉండుమమ్మా! నీకు భక్తితో నమస్కరింతును! నన్ను సమ్మతితో గాంచుమమ్మా!
పండితాభిప్రాయములు.
అవధాన భారతి. సాహితీ చతురానన. ఛందో వైవిధ్యనిష్ణాత. ఛందస్సవ్యసాచి. స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. హైదరాబాద్. 92913 33880.
సంశబ్దనం.
పద్యరచనలోనెన్నెన్ని మార్గములున్నవో- అన్నింట తన ప్రతిభాపాండితీవైభవముతో నడిచి- తనతో బాటు మరికొందరిని నడిపించి- శ్రీ భారతీ పద పద్మారాధకులుగా నిలిచిన వారు శ్రీ చింతా రామకృష్ణారావుగారు.
వీరి చిత్తవీథి యందు నొక భావన మెరుపుతీగవలె మెరసిన వెంటనే దానినొక రసవత్తర కావ్యముగా రచించి- తెలుఁగువారికి నందించుట యనునది యొక దీక్షగా తలంచినటుల - వీరు వ్రాసిన కావ్య పరంపరల ద్వారా మనము తెలిసికొన వచ్చును. వీరి ప్రోత్సాహముతో మరికొందరు పద్య ప్రేమికులు పద్య రచయితలై వీరివలె గ్రంథములు రచించి భాషాసేవ చేయుచున్నారు.
శ్రీ చింతావారి కలమునుండి జాలువారిన మరొక అద్భుత కావ్యము 'ఆంధ్రసౌందర్యలహరి." ఇది యనువాద కావ్యము. సాక్షాత్ శంకర స్వరూపమైన ఆదిశంకరాచార్య విరచితమగు' సౌందర్యలహరి" ని వీరు తెలుగున పద్యకావ్యముగా రచించుటయే కాక మూలశ్లోకములకు తెలుఁగు ప్రతిపదార్థమును భావమును వ్రాసి మనకునందించినారు.
ఒకరి కావ్యమను మరోకవి మరియొకభాషలో ననువదించుటకు - తదనువాద కవికి రెండు భాషలందు తగినంత పట్టుండవలయును, మూలకవి భావమును చక్కగా గ్రహించవలెను. ఉన్నదున్నట్టుగా భావ వ్యక్తీకరణ చేయవలయును. "కాళిదాసు కవిత్వము కొంత- నాకైత కొంత అన్నట్లుగా వ్రాయ కూడదు. సహజ భావన పాఠకులుమెచ్చు కొనునట్లుండవలెను.
ఏతద్విషయమున శ్రీ చింతావారు శ్రీశంకరుని భావముననుసరించియే - శ్లోకములకు పద్యములందించినారు. ఆయా ప్రతి పద్యమూ శంకరుని ప్రతిపాదిత భావమునే ప్రకటీకృతము చేయుచున్నది.
మొదట శ్రీగౌరీ ప్రార్థనాపద్యమునందే
శా. శ్రీమన్మంగళ! శాంభవీ జనని! హృచ్ఛ్రీ చక్ర సంవాసినీ!
సామాన్యుండను, నీ కృపామృత రుచిన్ సౌందర్య సద్వీచికన్
నీమంబొప్పఁ దెనుంగు చేసెద, నతుల్, నీవే లసద్వాణిగాఁ
బ్రేమన్ వెల్గుము శంకరాత్మ గతితోఁ బ్రీతిన్ గనన్ శంకరుల్.
అంటూ తాను సామాన్యుఁడనని, శ్రీ శంకరుని సౌందర్యలహరి అసామాన్యమని, ఆంధ్రానువాదము చేయుచుంటినని, నీవే లసద్వాణిగాఁ బ్రేమన్ వెల్గుమంటూ అనువాదమును ప్రారంభించి- అమ్మదయతో - అసామన్యమగు రీతిగా పద్యములను వ్రాసి తన ప్రతిభను వినయ మతితో తెలియఁజేసారు.
శంకరభగవత్పాదుల తొలి శ్లోకమగు “శివశ్శక్త్యా యుక్తో యది భవతి” ని మనోజ్ఞముగ అమ్మా! అంటూ త్రిమూర్తుల కర్తవ్యములను వారలకబ్బిన శక్తులకు నీవే మూలమనుచు చక్కని పదములతో రచించినారు.
42వ శ్లోకమగు “గతైర్మాణిక్యత్వం…..ధిషణామ్.” ను అనువదించునపుడు పద్యమునందు చూపిన పద శైలి మూలశ్లోక భావమున కంటె మరింత గొప్పగానున్నది.
60వ శ్లోకమగు “సరస్వత్యాస్సూక్తీ”….కినొనరించిన పద్యానువాదము ప్రశంసనీయము. పద్యమెత్తుగడలోనే “వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు” అంటూ శ్రీ చింతావారు తనకున్న సంస్కృతభాషాపాండితీశోభను అసామాన్యమగు రీతిగా మనముందు కనబరిచినారు.
90వశ్లోకమున “దదానే…..చరణతామ్.” అను శ్లోక అనువాదమునందు తుమ్మెదను సుకాండి యను పదప్రయోగమును జూపి తమకున్న పర్యాయపద ప్రయోగ చాతురిని ప్రదర్శించినారు.
నివేదనలో సౌందర్యలహరి మరియు తానొనర్చిన పద్యానువాదమునందలి పద్యములను పాఠకులు చదివినచో కవియైన నన్ను, చదివిన చదువరులనెల్లరను దయతో చూడుమని, ఫలశ్రుతిని వెల్లడి చేసినారు.
ఇలా వంద శ్లోకములకు వంద పద్యములు, వంద ప్రతిపదార్థములు, వందభావములను వ్రాసి శ్రీ రామకృష్ణారావు శ్రీ శంకరుల కృపకు, ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల దయకు పాత్రులైనారు.
*పుంభావ భారతీ* బిరుదుప్రదానము చేయుచు పంచరత్నములు.
కం. చింతా యను పద భావమె
చింతించుట యగును, మీరు చిత్తమునందున్
సంతతము చింత చేయుచు,
సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.
కం. ఎన్నని వ్రాయుదురయ్యా!
ఎన్నగ మీ ప్రాయ మెంత? యెసగెడు చిత్తం
బున్నట్టి శక్తి సంపద
లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!
కం. పద్దెములెన్నివిధంబులొ
యద్దెస మీ గమనముండు, నాలోచనముల్
తద్దిశ మెరయున్ గావ్యం
బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.
కం. *పుంభావ భారతీ* యని
సంబోధనతోడ మిమ్ము చక్కగఁబిలుతున్
బింబోష్ఠివాణి ఘనధీ
సంబంధయుతుండవౌట సత్కవివర్యా!
కం. సొంపగునీ బిరుదమ్మున్
సొంపుగ నే నిచ్చుచుంటి సుందరమతితో
న్నింపుగ నను మన్నించుచు
కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!
చక్రాల లక్ష్మీకాంతరాజారావు
19 . 10 . 2024.
చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., పుంభావభారతీ , పద్యకవితాభిరామ, చిత్రకవితాసహస్రఫణి, చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ., POL.,M.A.,.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో,
ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో
వ్రాసినది.)
3) ఆంధ్రసౌందర్యలహరి.
4) ఆంధ్రామృతమ్, పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో
అనేక స్వీయ రచనలు.
5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి పద్యానువాదము.
13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత
సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు తెలుగు భావము.
18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో
వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.
23) శ్రీ అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత
నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య
శతకము.)
30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.
(బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో
మూడు శతకములు.)
36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క
రోజులో వ్రాసినది.)
38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త
శివశతకము.
39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు,
సీతాన్వయముగా తేటగీతి పద్యముల
హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల
నక్షత్రమాల.)
40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార
ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక.
42) శ్రీరామ పట్టాభిషేకం.
43) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)
( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.
జైహింద్.