Thursday, September 11, 2008

వర్దిపర్తి కోనకవి.

వర్దిపర్తి కొనమరాట్ కవీన్ద్రుదుడి సర్వసిద్ది గ్రామం.నెల్లూరు నెరజాణల కొంటె ప్రశ్నలకు తుంటరి సమాధానం చెప్పిన ఉద్దనులు ౧౯ వ శతాబ్దంనాటి సర్వసిద్ధి వాస్తవ్యులు. కవీంద్రుని సమాధానాలకి అచ్చెరువొందిన ఆ కాన్తామనులు ఒక మెట్టు దిగి, " సర్వసిద్ధి సరసులకు నెల్లూరు నేరజాణలు దాసోహం " అనిరి. అంతటి మహాకవి అంటే కాదు మహిమాన్విత కవి కూడా. ఈ కవి వేంకటేశ్వరోపాఖ్యానం, మహాలక్ష్మీ పరిణయం, మున్నగు గ్రంధాలు రచించాడు. ఇతని పెక్కు చాటువులు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత్పర్యం.
ఇతడు రచించిన శ్రీ మహాలక్ష్మీ పరిణయం కావ్యం లోంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొందాం.

క్షీర సముద్రుడు తన కుమార్తె వివాహానికి రమ్మని తనకు కాబోయే అల్లుడయిన
శ్రీమహావిష్ణువుకి ఆహ్వానం పంపుతూ శుభలేఖలో ఇలా వ్రాస్తాడు.
సీ:-మత్స్య స్వరూపక! మనుజ కంఠీరవ! పురుషోత్తమ! త్రిశూల ధర ధనుర్వి
భంగ! కాకాసుర భంజన! విశ్వాత్మ! వామన! హరి! మురవైరి! నరక
శిక్ష! కుచేల సమ్రక్షక! సర్వజ్ఞ ! హరిహయనుత! చక్ర హస్త! రఘుకు
లాధిప! సర్వంసహాధీశ! మేఘ సన్నిభ గాత్ర! తపనాబ్జ నేత్ర! మునిజ
గీ:-నాభి వందిత! గాధేయ యజ్ఞ పాల! రావణాంతక! శ్రీ యాది దేవ! యనుచు
బ్రతి పద ప్రథమాక్షర పంక్తి సంజ్ఞ తెలియగా వ్రాసె.శుభ లేఖ జలధి విభుడు.
తాత్పర్యం సుబోధకమేగదా!
" మమ పుత్రికా వివాహమునకు సహచర సమేతముగా రా శ్రేయాదిదేవా! "
ఎంత చమత్కారంగా శుభలేఖ వ్రాయించాడో కవి చూచారా! ఇతని కావ్యాలన్నీకూడా చమత్కారాల సమాహారంగా చెప్పవచ్చు. సమయం చిక్కినప్పుడు మరో పద్యం గ్రహిచుదాం.
నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.
పద్య విపంచి.

No comments: