Thursday, March 22, 2012

శ్రీ నందన పంచాంగ శ్రవణము.

ఓం. శ్రీ గురుభ్యోనమః.
ఓంశ్రీమహాగణాధిపతయేనమః.   ఓంశ్రీమాత్రేనమః.   ఓంశ్రీ సరస్వత్యైనమః

ఉః- 
అందని భక్తి భావమది యందగఁ జేయగ నున్న పార్వతీ 
నందన! వందనంబు. కరుణాధన!  లోక ప్రసాధనంబుగా
నందన వచ్చె. నీ కరుణ నందనపై ప్రసరించి, సాహితీ  
నందన మందు సుందరపు నందనగా వరలింపఁ జేయుమా!
ఉః- 
వందనమమ్మ!శారద! సభాస్థలి నన్ వరలింప జేయు మీ
నందన నూతనాబ్ది శుభ నందనమై సుజనాళి కెల్ల నా
నంద నవోదయంబవ, ఘనంబుగఁ జేయుమ! లోకమందు ని
న్నందని వారు లేనటుల ఖ్యాతిగఁ జేయుమ! కల్పవల్లివై.
పద్మనాభః- 
జేపీనగర్నందు శ్రీజ్ఞాన వీచీ ప్రసిద్ధిన్ వెలార్చే ప్రభో! ఆంజనేయా!
నీ పాద పద్మాల నే భక్తితో మ్రొక్కి,  నీ యాశిసుల్ పొంది,  దీపింపనుంటిన్.
ప్రాపించె నీనందనాఖ్యంపు వర్షంబు, భవ్యత్వముం గొల్పి పోషింప రావా!
మా పాలి దైవంబ! మమ్మేలుమా నీవు. మాకున్ శుభంబుల్ ప్రసాదించు దేవా!
తోటకముః- 
కరుణాకర శ్రీపతి గాంచు మమున్.
పరమాద్భుత నందన వచ్చెనుగా!
వరమీయర! నందన వర్ధిలగా!
పరమేశ్వర! నీ కభివందనముల్.
ప్రియ పాఠక మహాశయులారా! 
స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పడ్యమీ శుక్ర వారం  తెలుగువారి ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులైన మీ అందరికీ, యావదాంధ్రులకూ, యావద్భారతీయులకూ, యావజ్జనానీకానికీ శుభాకాంక్షలు తెలియ జేసుకొంటున్నాను.
శాః-
శ్రీకల్యాణ మనోజ్ఞ భావ విలసత్ శ్రీ నందనాఖ్యాబ్ధిలో
శోకాతీత విశిష్ట సౌఖ్య ఫలముల్ శోభిల్లఁ జేయున్ మిమున్.
లోకేశుండు మదిన్ వసించు కుమతిన్, లోలత్వమున్ బాపుచున్.
శ్రీకారంబును జుట్టఁ జేయు తమచే శ్రేయంబులన్ జేయగా.
ఉగాదినాడు నింబకుసుమ భక్షణం చేయాలి. 
అదే వేప పూవు పచ్చడి.
దానిలో షడ్రుచులు మేళవింప బడతాయి.
అవి. నింబ, గుడ, లవణ, ఆమ్ల, జీరక, చూతములు.

ఆరోగ్యం నయతీతి ‘నింబః’ - అనగా ఆరోగ్యము నిచ్చునది. వేప
గుడతి రక్షతీతి ‘గుడం’ - అంటే రక్షించునది. బెల్లం
లునాతివాతం జాడ్యంవా ‘లవణం’ - అంటేవాత జాఢ్యములను పారద్రోలునది. ఉప్పు
సహస్రరోగాన్ విధ్యతే ఇతి ‘సహస్రవేధి’ - అంటే అనేక రోగములఎఱుక కలది. చింతపండు
జీర్యతే అన్నమనే నేతి ‘జీరకః’ - అంటే ఆహారమును జీర్ణము చేయునది. జీలకర్ర
సహకారయతి మేళయతిస్ర్తి ‘సహకారః’ - అంటే మేళవింపు చేయునది. మామిడి.
శ్లోః-
శతాయుర్వజ్ర దేహాయ, సర్వసంపత్కరాయచ|
సర్వారిష్ట వినాశాయ, నింబ కందళ భక్షణా||
షడ్రసోపేతమైన ఈ ఉగాది పచ్చడి తినవలెను.
మరియు,
ఉగాది సందర్భముగా పంచాంగ  పఠన శ్రవణ ఫలము లసాధారణమైనవి.

శ్లోః-
చైత్రమాసి జగద్రహ్మ ససర్జ ప్రథమే అహని
వత్సరాదౌ వసంతౌదౌ రవి రాద్యే తథైవచ!
విధాతయైన బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని 60 సంవత్సరాల్లోని మొదటిదైన ప్రభవనామ సంవత్సరం, 12 మాసాల్లో మొద టిదైన చైత్రమాసం, ఆరు ఋతువుల్లో మొద టిదైన వసంతఋతువు, వారాల్లో ఆదివారం, 30 నిథుల్లో పాఢ్యమి తిథి, 27 నక్షత్రాల్లో మొదటిదైన అశ్వినీ, ఇలా అన్ని మొదటితోనే ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ఉగాది పండుగ మనకు, ప్రధానమైన పండుగ.
శ్లోః-
తిథిర్వారంచ నక్షత్రం - యోగః కరణ మేవచ.
పంచాంగమితి విఖ్యాతం - లోకోయం కర్మ సాధనం.
తిథియు, వారంబు, ఋక్షము, దీప్త యోగ,
కరణము లిట పంచాంగము లరయ నగును
మనకు పంచాంగమందున. దిన ఫలాదు
లెఱిగి, కర్మ చేయగ నగు నెల్లరకును.
తిథి, వార, నఖత్ర, యోగ, కరణములు అను ఈ ఐదు అంగములు కలిగియున్నది పంచాంగము. కర్మసాధకులగు లోకులకిది అత్యంత ఆవశ్యకము.
అబ్దాదిని పంచాంగ శ్రవణ క్రమంబెట్టిదనిన.
శ్లోః-
అబ్దాదౌ ప్రాతరుద్ధాయ మంగళ స్నానమాచరేత్. 
వస్త్రై రాభరణై ర్దేహ మలంకృత్య తతః శుచిః.
నవ గ్రహాంశ్చ, పంచాంగం, శ్రీ గణేశంచ, భారతీం, 
దైవజ్ఞమపి సంపూజ్య స్సాన్వయస్య పురోహితః.
నత్వా కాలాత్మకం సూర్యం, పంచాంగం గణితోత్తమం 
తిథిర్వారాదికం సర్వం శృణుయా త్తత్ఫంచవై.
ఉగాదినాడు వేకువ జామునే లేచి, మంగళస్నానము చేసి, మంచి శుభ్రమైన వస్త్రములను, ఆభరణములను ధరించవలెను. శుచిగా నవగ్రహములను, పంచాంగమును, గణేశుని, సరస్వతిని, దైవజ్ఞుని, పురోహితుని, పూజించి, కాలాత్ముఁడగు సూర్యుని ఉపాసించి, పంచాంగ ఫలంబు విని అనుష్టాన పరుండు కావలెను.  
శ్లోః-
తిథేశ్చ శ్రియమాప్నోతి - వారా దాయుష్య వర్థనం,
నక్షత్రాత్ హరతే పాపం, - యోగాద్రోగ నివారణం,
కరణాత్ కార్య సిద్ధిశ్చ. - పంచాంగ ఫలముత్తమమ్.
కాలవిత్ కర్మకృత్ ధీమాన్ - దేవతానుగ్రహం లభేత్.
గీః-
తిథియ శ్రీలను కలిగించు దీప్యముగను,
వారమాయువు నొసగును,  ప్రగణితముగ
పాప హరణము నక్షత్ర మోపి చేయు
యోగమది రోగములు బాపి యోగ మొసగు,
కరణ మది కార్య సిద్ధిని కలుగఁ జేయు,
ఇట్టి పంచాంగమును విను దిట్టలకును.
కాల మెఱిగి కర్మలు చేయు ఘనుల కెపుడు
దేవతానుగ్రహము కల్గు దివ్యముగను.

పంచాంగ శ్రవణము చేయు వారికి తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, కలుగును. నక్షత్రము వలన పాప హరణము, యోగము వలన రోగ నివారణ, కరణము వలన కార్య సిద్ధి సంభవించును. కనుక కాలము తెలిసి కర్మలు చేయువారు భగవదనుగ్రహము పొందుదురు.
మరియు,
శ్లోః-
కన్యావనీ కాంచన దిగ్గజానాం - గవాం సహస్రం సతతం ద్విజేభ్యః
దత్వా ఫలం యల్లభతే మనుష్య - తత్తత్ఫలం యజ్ఞ ఫలం సమృద్ధం.
ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభి వృద్ధిం - నిత్యారోగ్యం సంపదంచాzనపాయీమ్.
యచ్చిన్నానా ముత్సవానామహిప్తిం - యతం త్యే తే వత్సరాథీశ ముఖ్యాః.
ఉః- 
కన్నియ, కాంచనంబు, భువి, గంధ గజాదులు, గో సహస్రమున్
మన్నిక గన్న విప్రునకు మంచిగ చేసిన దాన సత్ఫలం
బెన్నగ వచ్చువిన్నను సమీప్సిత వత్సరనాయకాదులన్.
మిన్నగు యజ్ఞ సత్ఫలము మేలుగ కల్గు సునందనంబునన్.
కన్య, భూమి, బంగారము, ఏనుగులు,ఆవులు మొదలగునవి వేయింటిని ఉత్తములకు దానము చేసినంత ఫలము పంచాంగము యొక్క సంవత్సర ఫలము విన్నంత మాత్రముననే వచ్చును. 
మరియు, 
శ్లోః- 

''ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభివృద్ధిన్‌
నిత్యారోగ్యం సంపదం చానపాయీమ్‌
అచ్ఛిన్నానాముత్స వానామ వాప్తిం
యత్యం త్యేత వత్సరాధీశ ముఖ్యాః'' 

ఆయుర్వృద్ధిపుత్ర పౌత్రాభివృద్ధిఆరోగ్యాన్ని సంప దనుకళ్యాణ మహోత్సవాలను సుఖశాంతులనుఈ సంవత్స రాధీశులు ఇచ్చుచున్నారు.
శ్లోః-
సూర్యశ్శౌర్య మదేందు రింద్ర పదవీం సన్మంగళం మంగళః.
సద్బుద్ధించ బుధో, గురుశ్చ గురుతాం, శ్శుక్రస్సుఖం శం శనిః.
రాహుర్బాహు బలం కరోతు సతతం, కేతుః కులస్యోన్నతిమ్,
నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వే నుకూలా గ్రహాః.
మః- 
రవిసౌర్యంబును, చంద్రుఁడింద్రపదవిన్, ప్రఖ్యాత సన్మంగళం
బు విరాజిల్లగ జేయు మంగళుఁడు. సద్ బుద్ధిన్ బుధుండిచ్చు.నీ
భువిపై సద్గురుతన్ గురుండొసగు, సత్పూజ్యుండుశుక్రుండుతా
నవ సౌఖ్యంబు నొసంగు, శోభనము మిన్నం గొల్పు మందుం డిలన్.

భువిపై బాహు బలంబు రాహు వొసగున్. భూష్యంపు వంశోన్నతిన్
సవిధంబిచ్చును కేతువెన్నుచు. ప్రశంసార్హంపు పంచాంగమున్
సవిధేయంబుగ విన్న వారలకిలన్ సంవత్సరంబంతయున్
భువిసౌఖ్యంబగు. కన్న వారలిల సంపూర్ణాయురారోగ్యులౌన్.
శ్లోః-
తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ,
పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్.
గీః-
తిథియు, వారంబు, ఋక్షము, దీప్త యోగ,
కరణ ములిట పంచాంగము లరయ నగును.
మనకు పంచాంగమందున. దినఫలాదు
వినిన గంగ మున్గుఫలము నిచ్చునిజము.
శ్లోః-
పంచాంగస్య శ్రవణాత్ సు పుణ్య జనకం, సంవత్సరః సాధ్యతామ్. 
రాజ్ఞాం రాజనుతౌ జయో విజయతే మంత్రే ఫలం బుద్ధిదం.
ధాన్యం ధాన్యపతే, సురపతే క్షేత్రేశ వృద్ధిస్తధా
సస్యం సర్వ సుఖంచ వత్సర ఫలం సంశృణ్వతాం సిద్ధిదమ్.
మరియు
శ్లోః-
శ్రీకల్యాణ గుణావహం, రిపుహరం, దుస్స్వప్న దోషాపహమ్,
గంగాస్నాన విశేష పుణ్యఫలదం, గోదాన తుల్యం నృణామ్,
ఆయుర్వృద్ధిద ముత్తమం, శుభకరం, సంతాన సంపత్ప్రదమ్,
నానాకర్మ సుసాధనం, సముచితం పంచాంగమాకర్ణ్యతామ్. 
శాః-
శ్రీ కల్యాణ గుణావహమ్ము. రిపులన్ ఛేదించు. దుస్స్వప్న మే
ధా కాలుష్యము బాపు. గంగ మునుగన్  దక్కేటి పుణ్యంబు, ప్ర
త్యేకం బావుల దాన సత్ఫలమిడున్. ధీయాయువుల్ పెంచు. శో
భా కార్యాన్వయ.సంతతిన్ గొలుపు. సంపన్నంబు చేకూర్చు.శో
భా కార్యాద్భుత సాధనమ్ముచితమౌన్. పంచాంగమున్ విన్నచో.
ప్రస్తుత కలియుగానికి 4,32,000 ఆయుష్షు కలిగియుగాన్ని నాలుగు పాదాలుగా విభజిస్తే, లక్షా ఎనిమిది వేల సంవత్సరాలు గల మొదటి పాదంలో ఈ నందననామ సంవత్స రం 5,113వ సంవత్సరం. ఈ కలియుగం ఇంకా 4 లక్షల సంవత్సరాలకు పైగా మిగిలి యున్నది.
ఈ రోజు తిథ్యాది పంచాగములం గూర్చి తెలుసుకొందము.
శ్రీ నందన నామ సంవత్సరం.
తిథి: చైత్ర శుద్ధ పాడ్యమి రాత్రి  గం.08.35 ని.ల వరకు.
వారము: శుక్ర వారము.
నక్షత్రం: ఉత్తరాభాద్ర నక్షత్రము. పగలు గం. 12.34ని.ల వరకు.
యోగము: బ్రహ్మ యోగము ఘ.౫౧.౨౦ వరకు.
కరణము: కింస్తు కరణము. ఘ.౦౭.౨౪. వరకు.
ఈ  నందన  సంవత్సర ఫలము.
శ్లోః- 

నందనాబ్దే ఖిలా పృథ్వీబహు సస్యార్ఘవృష్టిభి:
ఆనందాఖిలానాంచజంతూనాంచ మహాభుజామ్.
కః-
నందన సంవత్సరమా
నందము రాజులకు ప్రజకు. నయ వృష్టి. ధర 
ల్డెందము కందిల యుండును.
సుందరముగ పండు భూమి. శోభిల నొప్పున్.
నందన సంవత్సరమున భూమి అనేక పంటలతోను, వెలతోను, వర్షములతోను వర్ధిల్లును. అంతటా ప్రజలకూ, రాజులకూ ఆనందముగా యుండును. 
నవ నాయకులు - కలిగే ఫలితములు.
౧. రాజు. శుక్రుఁడు.  
శ్లోః- 

సమృద్ధ సస్యా వసుధాతివృష్టి: -  గావోహి సంపూర్ణ పయః ప్రదాస్స్యు:
స్త్రియ: ప్రియాణాం జనయంతి తోషం - కామోపచారైః భృగుజేబ్ధనాధే.
గీః-
రాజు శుక్రుఁడై యుండిన రమ్యముగను
పంటలను పండు భూములు. పాలనిచ్చు
ధేనువులు తుష్టిగా. కొల్పు  స్త్రీలు తుష్టి
పతుల కెనలేని  సుఖమిచ్చి, వరలఁజేయు.
మెండుగ పండునుభూములు.
దండిగ వానలును కురియు. ధరణిని గోవుల్
దండిగ పాలిచ్చును.మది
నిండగ పతులకు ముదంబు నింపును వనితల్.
భూమి సస్యములతో నిండి యుండును. వానలు అధికముగా కురియును. ఆవులు, పసువులు సమృద్ధిగా పాలనిచ్చును. స్త్రీలు కామోపచారములతో తమ ప్రియులను ఆనందపరచెదరు.
౨. మంత్రి. శుక్రుఁడు.
శ్లోః- 

సువృష్టి: సర్వ సస్యాని, - సర్వే ధర్మ రతాః ప్రజా:
క్షేమారోగ్యే  సుభిక్షం స్యాత్ - మంత్రణ్యబ్దే భృగౌ యది.   
గీః-
మంత్రి శుక్రుఁడైన మంచివానలు పడు. 
మంచి పంట పండు. మహిని ప్రజలు
ధర్మ నిరతులగుచు ధరణిపై ఆరోగ్య
వంతులగుచు సుఖము పడయు. నిజము.
సర్వ సస్యములకు అనుకూలముగా వర్షములు కురియును. ప్రజలు ధర్మమునందు ఆసక్తి కలిగి యుందురు. ప్రజలందరూ ఆరోగ్యముగా సుభిక్షముగా నుందురు.
రాజు మంత్రి ఒకరే. ఐనచో కలుగు ఫలము.
శ్లోః- 

స్వయం రాజా స్వయం మంత్రీ - యస్మిన్నబ్దే యదా భవేత్
చోరాగ్ని శస్త్ర బాధాచ - పీడ్యంతే భూభుజాదయః.

శుక్రుఁడే రాజు మాంత్రియై చొక్కి యున్న
అగ్ని, చోర, శస్త్ర విపత్తి నడలు ప్రజలు.
రాజు పీడింపఁ బడు భువిని. భూజనులకు
రాజుకును దుష్ట ఫలమిది. పాడు కలుగు.
రాజు మంత్రి ఒకే గ్రహమునకు సంభవించినచో రాజులు అగ్ని, చోర, శస్త్రములచే బాధింప బడుదురు.

౩. సేనాధిపతి. గురుఁడు 
శ్లోః- 

నృపాస్సదా సద్విధి సంప్రవృత్తా: - విప్రాస్సదా వేద విధి ప్రవృత్తా:
జనాస్సదా సంభృత ధర్మ వృత్తా: - సైన్యాధిపత్యే సురమంత్రిణశ్చ.
గీః-
సేనకధిపతి గురుఁడైన క్షేమమేను.
నృపులు సద్విధు లొనరింత్రు. ప్రీతిఁజేయు
బ్రాహ్మణులు వేద విధులను భక్తి తోడ.
జనులు సద్ధర్మ వర్తులై చక్కనుంద్రు.
పాలకులు సత్కర్మలయందు శ్రద్ధ చూపెదరు. బ్రాహ్మణులు వేద ప్రోక్త యజ్ఞ యాగాదులనాచరించెదరు.ప్రజలు ధర్మమునందు ఆసక్తి చూపెదరు.
౪. సస్యాధిపతి. చంద్రుఁడు.
శ్లోః- 

జల ధాన్యాని సర్వాణి స్థల ధాన్యాని యానిచ
వృక్ష జాతిస్సుఫలితా చంద్రే సస్యాధిపతే.
గీః-
చంద్ర సస్యాధిపత్యము సత్ఫలదము.
భువిని జలధాన్యముల పంట పొంగి పొరలు.
ఘనత సుస్థల ధాన్యముల్  కలియ పండు.
వృక్ష జాతులు ఫలియుంచు పెంపు మీర.
జల  ధాన్యములు, స్థల ధాన్యములు, వృక్ష జాతులు చక్కగా ఫలించును.
౫. ధాన్యాధిపతి. శని.
శ్లోః- 

కృష్ణ ధాన్యాని సర్వాణి సూక్ష్మ ధాన్యాని యానుచ
కృష్ణ భూమిస్సుఫలితా ధాన్యాధీశే శనైశ్చరే.
కః-
శని ధాన్యాధిపతి యయిన
ఘనముగ ఫలియించు నలుపు గల ధాన్యములున్,
తినదగు చిఱు ధాన్యంబులు,
మన నల్లని భూమి పండు మహనీయముగా.
నల్లని ధాన్యములు, చిఱు ధాన్యములు, నల్ల రేగడి భూములు చక్కగా ఫలించును.
౬. అర్ఘాధిపతిః గురుఁడు.
శ్లోః- 

సువృష్టి ర్ధాన్య ధనైర్విరాజితా - భూమిర్మహా యజ్ఞపరైర్మహీసురై:
నిత్యోత్సవైర్మంగలతూర్యనిస్వనై: - అర్ఘాధిపే దేవగురౌచ శశ్వత్.
కః-
గురుడర్ఘాధిపతి యయిన
ధర వృష్టిని, పంటనలరు. ధరసురలు మహ
ద్వరముగ క్రతువులు చేతురు.
ధర మంగళ వాద్య మెలయు ధాత్రిని శుభముల్.
భూమి వర్షముల చేత ధన ధాన్య సంపదల చేత నిండి యుండును. బ్రాహ్మణులు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుచుందురు. మంగళ వాయిద్యములచేత నిత్యము ఉత్సవముల్ జరుగు చుండును.
౭. మేఘాధిపతిః గురుఁడు.
శ్లోః- 

సస్యార్ఘ వృష్టిభిస్తుష్టా - భవేద్ధాత్రీ నిరంతరం.
వీత రోగ భాయాస్సర్వే - మేఘాధీశే బృహస్పతౌ.
గీః-
గురుఁడు మేఘాధిపతియైన కువలయమున
ప్రజలు రోగవిదూరులై భవ్యమైన
పంటపండింత్రు. చక్కని వానలుండు.
ధరలు తగినట్టులుండును. వరల జేయు.
రోగములు లేనివారై ప్రజలు నిరంతర సస్యముల చేత, వర్షముల చేత సంతోషముగా ఉందురు. ధరలు అందుబాటులో ఉండును.
౮. రసాధిపతి. బుధుఁడు.
శ్లోః- 

శశి తనయే రస నాధే సుపిప్పలీశొంఠి హింగులశునాని
ఘృత తైలాద్యం నిఖిలం దుర్లభ మిక్షూద్భవంశకలమ్.
గీః-
బుధుఁడిల రసాధిపుండైన భువిని శొంఠి,
పిప్ప లింగువ, నెయ్యియు, వెలలు పెరుగు.
ఉల్లిపాయలు, నూనెలు, బెల్ల మెన్న
దుర్లభంబయి యుండును. దునుకు కొలుపు.
పిప్పళ్ళు, శొంఠి, ఇంగువ, ఉల్లిపాయలు, నెయ్యి, నూనెలు, బెల్లము మున్నగు రస వస్తువులు దుర్లభముగా నుండును.
౯. నీరసాధిపతిః చంద్రుఁడు.
శ్లోః- 

ముక్తాఫలం రత్న బీజకాంస్యాది వస్త్రాభరణాని సర్వం
వృద్ధిం గత్యాశు భవన్తి లోకే చంద్రో యదా నీరస నాయకో భవేత్.
గీః-
నీరసాధీశ చంద్రుఁడు నిరుపమగతి
ముత్యములు, రత్నములు, స్వర్ణము, మరి కంచు
లోహ, వస్త్రాభరణములు,  లుప్త మవక
మనకు లభియించు ధర తగ్గి మానితముగ.
ముత్యములు, రత్నములు, సువర్ణము, కంచు, మున్నగు లోహములు వస్త్రములు, ఆభరణములు మున్నగునవి విరివిగా లభించును.
ఉప నాయకులు ౨౧ మంది.
౧.పురోహితుఁడు - చంద్రుఁడు.
౨. పరీక్షకుఁడు - రవి.
౩. గణకుఁడు - కుజుఁడు.
౪. గ్రామ పాలకుఁడు - శుక్రుఁడు.
౫. దైవజ్ఞుఁడు - గురుఁడు.
౬. రాష్ట్రాధిపతి - శుక్రుఁడు.
౭. సర్వ దేశోద్యోగపతి  - శుక్రుఁడు.
౮. అశ్వాధిపతి - శుక్రుఁడు.
౯. గజాధిపతి - చంద్రుఁడు.
౧౦. పశువులకధిపతి - గురుఁడు.
౧౧. దేవాధిపతి - చంద్రుఁడు.
౧౨. నరాధిపతి - గురుఁడు.
౧౩. గ్రామాధిపతి - రవి.
౧౪. వస్త్రాధిపతి - బుధుఁడు.
౧౫. రత్నాధిపతి - శుక్రుఁడు.
౧౬. వృక్షాధిపతి - శని.
౧౭. జంగమాధిపతి - చంద్రుఁడు.
౧౮. సర్పాధిపతి - కుజుఁడు.
౧౯. మృగాధిపతి - గురుఁడు.
౨౦. శుభాధిపతి - శుక్రుఁడు.
౨౧. స్త్రీలకధిపతి - గురుఁడు.
శుభ గ్రహములు ౧౮.
పాప గ్రహములు ౩.
క్రూరగ్రహ ఫలం క్రూరమ్ - శుభ గ్రహ ఫలం శుభం.
పురోహితాది సర్వేషాం - భవేదీశ సముద్భవమ్.
పురహితాద్యు పనాయక సరళి చూడ
క్రూర గ్రహములు కలిగించు క్రూర ఫలము.
శుభ గ్రహంబులు కలిగించు శుభ ఫలంబు.
ఈశునాధీనమున బుట్టుటెఱుగ దగును.
పురోహితాది ఉపనాయకులు గా ఉన్న క్రూరగ్రహములు ౩  క్రూర ఫలమును, శుభ గ్రహములుగా ఉన్న ౧౮  శుభ ఫలమును కలుగ జేయుదురు.
ఈ సంవత్సరము  పశు పాలకుఁడు, గోష్ట ప్రాపకుఁడు, గోష్ట బహిష్కర్త శ్రీ కృష్ణుఁడు. 
దాని ఫలితము.
శ్లోః- 

పశువృద్ధిస్సుభిక్షంచ బహు సస్యార్ఘసంపద:
సంపూర్ణ తృణ వృద్ధిశ్చ గోపాలే పశు నాయకే.
గీః-
గోవులకు పతి కృష్ణుఁడు, కువలయమున
పశువులకు వృద్ధియు, సుభిక్ష భాగ్యమొప్పు.
పంటలన్నియు పండును పచ్చి గడ్డి
వృద్ధి చేయును పశువుల పృథ్విపైన.
పశువులు ఆరోగ్యముగా నుండును.సుభిక్షముగా నుండి అభి వృద్ధినిపొందును. తృణ సమృద్ధి కలుగును. పసువులు సుఖముగా పాలను ఇచ్చును.  ధరలు అనుకూలముగా ఉండును.
మేఘనిర్ణయము.
ఆవర్తన అను మేఘము. ఆవర్తే మంద తోయం స్యాత్. అల్ప వృష్టి.
మేరు శిఖరమందు ఉత్పత్తి యగును. ఇందు వలన సువృష్టి, పూర్వ సస్యములు అభివృద్ధి.
సంవర్త నామక మేఘము. సంవర్తేచోత్తరా వృష్టిః. ఉత్తర వానలు.
సువహ నామక వాయువు. సువహో వృష్టికృత్ సదా. ఎల్లప్పుడూ వర్షములు పడును.
నిశ్చల అను మెఱుపు. నిశ్చలాతు మహార్ఘదా. ధరలు పెరుగును. 
స్కలిత అను ఉరుము. స్కలితాత్ ఉత్తమా వృష్టిః. వర్షములధికము.
క్షార నామక సముద్రము. క్షారః వాయు సమాయుక్తం. గాలితో కూడిన వానలు.
భూ వాహన శేష ఫలము.
అనంతుఁడు అను శేషుఁడు భూమిని మోయుచున్నాఁడు. అనంత వస్తు సంపూర్ణా భూమిఃస్వస్థా జనాస్తధా.  దీని ఫలితముగా భూమి అనంత సంపదలతో నిండి యుండును.ప్రజలు ఆరోగ్యముతో ఆనందముగానుందురు.
ఆఢక నిర్ణయము:
ఈ సంవత్సరము కుంచముల వాన. భాగములు సముద్రమున, భాగములు పర్వతములందు, భాగములు భూమిపైన పడును.
కుంచము౨౩-౩-౨౦౧౨ నుండి ౧౬-౫-౨౦౧౨ వరకు బాల గోప హస్తమందు, ఫలితము వర్ష లేమి. గోప హస్తమగుటచే సుభిక్షము.
అప్పటి నుండి ౪-౮-౨౦౧౨ వరకు వృద్ధ బ్రాహ్మణుని చేతియందు, దుర్భిక్షము, సస్య నాశము.
నాటి నుండి ౮-౧౧-౨౦౧౨ వరకు బాల గోపకుని చేతి యందు, ఫలితము వర్ష లేమి. గోప హస్తమగుటచే సుభిక్షము.
నాటి నుండి వత్సరాంతము యౌవన గోపకుని చేతు యందు ఉండును. సుభిక్షము, ఆరోగ్యము, సంపదలు కలుగును.
పుష్కరములు.: 
౧౭-౪-౨౦౧౨ ఉదయం ౧౦.౩౬ నుండి శ్రీ నర్మదా నది పుష్కరములు ప్రారంభమగును.
ఆ ప్రాంతము వారికి శుభ కార్యములు నిషిద్ధము.
మూఢము:
వైశాఖ శు.౮ఆది వారము౨౯-౪-౨౦౧౨ నుండి జ్యేష్ట శు.౮మంగళవారం ౨౯-౫-౨౦౧౨ వరకు గురు మూఢము.
జ్యేష్ట శు.౧౧శుక్రవారం ౧-౫-౨౦౧౨ నుండి జ్యేష్ట బ.౭ ఆదివారం ౧౧-౬-౨౦౧౨ వరకు శుక్ర మూఢము.
మాఘ శు.౬ శనివారం ౧౬-౨-౨౦౧౩ నుండి వత్సరాంతము శుక్ర మూఢ్యమి.
వివాహాది శుభ కార్యములు నిషిద్ధము.
అధిక మాసముః-
ఈ సంవత్సరము తే.౧౮ - ౮ - ౨౦౧౨ నుండి తే. ౧౬ - ౯ - ౨౦౧౨ వరకు అధిక భాద్రపద మాసము.
మకర సంక్రాంతి: ౧౪.౧.౨౦౧౩ సోమ వారము, ధనిష్టా నక్శత్రమున మేష లగ్నమున పగలు గం.౧౨.౦౯ని.లకు రవి మకరమున ప్రవేశించును.
శ్లోః- 

అష్ట కర్ణో విశాలాక్షో లంబభ్రూర్దీర్ఘనాసికః - అష్ట బాహుశ్చరుర్వక్ర్త్ర స్సంక్రాంతి పురుష స్మృతః.
శత యోజనమౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశ స్మృతం - ఏవం రూపంహి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతిః.
ఈ సంక్రాంతి పురుషునకు ధ్వాంక్షాని పేరు. విటులకు అరిష్టము.
చందనజలస్నానము చేయును. ఆరోగ్యప్రదము.
జొన్నలను అక్షతలుగా ధరించును. జొన్నలకు నాశనము.
నీలివస్త్రము ధరించును. గొప్ప భయ కారకము.
లక్క గంధముగా ధరించును. యుద్ధ భయము.
జపాపుష్పము ధరించును. కీర్తికి హాని.
గోమేధికమును ఆభరణముగా ధరించును. పసువులకు హాని.
సీస పాత్రమున భుజించును. ఆరోగ్యప్రదము.
పాలను త్రాగును. పసువులకు హాని.
రేగు పండు తినును. శుభప్రదము.
గజ వాహనము. రాజులకు హాని.
విల్లును ఆయుధముగా స్వీకరించును. యుద్ధము కలుగును.
కాంచన ఛత్రమును ధరించును. బంగారము వెల పెరుగును.(నశించును).
అస్త్రములను ధరించును. రోగ భయము.
ఆగ్నేయదిశగా ప్రయాణము తద్దేశారిష్టము.
విస్మయ చేష్ట.ప్రజావృద్ధి కలుగును.
నివిష్టుఁడుగా ఉండును. సస్య వృద్ధి.
శుక్ల పక్షమున వచ్చియున్నందున ప్రజలకు రోగ, రాజుకు యుద్ధ భయము.
తదియనాడు వచ్చును. సుఖప్రదము.
సోమవారము వచ్చును. సుభిక్షము.
ధనిష్ట యందు వచుచున్నందున గో హాని.
ప్రథమ ముహూర్తమున వచ్చు చున్నందున మధ్యమ వర్షములు.
మకర లగ్నమున వచ్చు చున్నందున జన క్షయము.
పూర్వాహ్నమున వచ్చుచున్నందున రాజులకుహాని.
గ్రహణములు:
తే.20-5-2012.దీని సూర్య గ్రహణము.ఈశాన్య భారతంలో ౭, ౮ నిమిషములే కనబడును.
౪-౬-౨౦౧౨ చంద్ర గ్రహణము.
౧౩-౧౧-౨౦౧౨ సూర్య గ్రహణము.
౨౮-౧౧-౨౦౧౨చంద్ర గ్రహణము.
మన దేశమున కనిపించవు.
ఆదాయ వ్యయములు:
మేషమునకు   ఆదాయము  2     వ్యయము   8
వృషభమునకుఆదాయము 11    వ్యయము 14.
మిధునానికి     ఆదాయము 14    వ్యయము 11. 
కర్కా టకానికి  ఆదాయము  8     వ్యయము 11.
సింహమునకు ఆదాయము 11    వ్యయము   5. 
కన్యకు             ఆదాయము 14    వ్యయము 11.
తులకు            ఆదాయము 11    వ్యయము 14.
వృశ్చికముకుఆదాయము 2     వ్యయము  8
ధనుస్సుకు   ఆదాయము 5    వ్యయము 14. 
మకరముకు  ఆదాయము 5    వ్యయము   5. 
కుంభముకు  ఆదాయము 5    వ్యయము   5. 
మీముకు    ఆదాయము 5    వ్యయము 14. 
రాజ పూజ్య అవమానములు: 
మేషం .        రాజపూజ్యము 1 అవమానము 7.
వృషభం       రాజపూజ్యము అవమానము 7.
మిధునం.    రాజపూజ్యము  అవమానము7.
కర్కాటకం    రాజపూజ్యము 3 అవమానము 3.
సింహం        రాజపూజ్యము  6 అవమానము 3.
కన్య             రాజపూజ్యము  2 అవమానము 6.
తుల            రాజపూజ్యము  5 అవమానము 6.
వృశ్చికం      రాజపూజ్యము  1 అవమానము 2
ధనుస్సు     రాజపూజ్యము  4 అవమానము 2.
మకరం        రాజపూజ్యము  7 అవమానము 2.
కుంభం        రాజపూజ్యము  అవమానము 5.
మీనం          రాజపూజ్యము  6 అవమానము 5.
కందాయ ఫలములు: 
అశ్విని            2  .   1   .   0.
భరణి              5  .  2   .   2.
కృత్తిక             0  .  0   .   4.
రోహిణి            3   .  1   .   1.
మృగశిర         6   .  2   .   3.
ఆరుద్ర            1  .   0   .   0.
పునర్వసు      4  .   1   .   2.
పుష్యమి         7  .   2  .    4.
ఆశ్లేష              2   .  0   .   1.
మఖ               5   .  1   .   3.
పుబ్బ             0   .  2   .  0.
ఉత్తర              3    .  0  .   2.
హస్త               6    .  1   .   4.
చిత్త                1    .  2  .    1.
స్వాతి             4    .  0  .   3.
విశాఖ            7   .   1   .  0.
అనూరాధ      2   .   2  .   2.
జ్యేష్త               5   .   0  .   4.
మూల            0   .   1   .  1.
పూర్వాషాఢ   3   .   2   .  3.
ఉత్తరాషాఢ     6   .   0   .  0.
శ్రావణం          1   .   1   .  2.
ధనిష్ట             4  .    2    . 4.
శతభి              7  .   0    .  1.
పూర్వాభాద్ర   2  .    1    .  3.
ఉత్తరాభాద్ర     5  .    2    .  0.
రేవతి.             0  .    0    .  2.
బేసి సంఖ్య ధన లాభము
సమ సంఖ్య  సమ ఫలము.
సున్న శూన్య ఫలము.
ఒకటి, రెండు సున్నలు భయము.
మూడవ సున్న  హాని.
సంవత్సర ఫలము:
అశ్విని . పుష్యమి . స్వాతి . అభిజిత్తు వారలకు యుద్ధ భయము.
భరణి . ఆశ్రేష . విశాఖ .  శ్రవణం వారలకు అలంకార ప్రాప్తి.
కృత్తిక . మఘ . అనూ . ధనిష్ఠ వారలకు రోగ భయము.
రోహిణి . పుబ్బ . జ్యేష్ఠ . శతభిషం వారలకు ఆయుర్వృద్ధి.
మృగశిర . ఉత్తర . మూల . పూర్వాభాద్ర వారలకు అర్థ లాభము.
ఆర్ద్ర . హస్త . పూర్వాషాఢ . ఉత్తరాభాద్ర వారలకు మనస్తాపము.
పునర్వసు . చిత్ర . ఉత్తరాషాఢ . రేవతి వారలకు రాజ పూజ్యము.
సర్వాణి సన్మంగళాని భవంతు.
స్వస్తి

Tuesday, March 6, 2012

మాతృ వియోగంతో విషాద మగ్నులై యున్న శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నాము.

మాతృ దేవోభవ.
ఆంధ్ర భాషార్నవాన్ని అవలీలగా ఆపోసన పట్టి, తన ధిషణా పాటవంతో మేథో మదనం చేసి, ఆంధ్రామృతాన్ని అవలీలగా సృజింప జేస్తూ, యావదాంధ్రభాషాభిమానులకూ అంద జేస్తూ హృదయాలలో సహృదయ శిరోమణిగా స్థిరుఁడై అనితర సుసాధ్యమైన అవధాన పటిమతో ధారణా ప్రతిభతో అవధాన బ్రహ్మ రాక్షసుఁడుగా కీర్తింపబడే బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారికి జన్మనిచ్చి, ఆంధ్ర మాతకే కన్న తల్లి యైన గరికిపాటివారి మాతృమూర్తి తన భౌతిక దేహమును వీడి, స్వర్గపథము చేరడం నరసింహారావు గారికే కాక యావదాంధ్ర జనావళికీ బాధాకరము.
సృష్టి ధర్మము అనుల్లంఘనీయము కదా! ఆ మాతృ మూర్తి  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,
శ్రీ గరికిపాటి నరసింహారావుగారికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నాము.