Thursday, November 22, 2012

సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా? పద్య కవిత పోటీలో మన సోమార్క గారికి ప్రథమ బహుమతి

జైశ్రీరామ్.
సాహితీ పిపాసులారా! సుమనర్నమస్సులు.
ఇప్పుడు  రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొనిన శ్రీ అర్క సోమయాజిగారిని గూర్చి తియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. వారిని మనము హృదయ పూర్వకంగ అభినందిద్దాము. వారికి ఈ బహుమతి కైవసమైన వార్తను వారి మాటలలోనే చూద్దాము.
అయ్యా! నమస్కారాలు!
ఇటీవల సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా?అని ప్రశ్నిస్తూ,ఒక సంస్ఠ పద్య పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నా సమాధానాన్ని "పద్య శైలూషి "అనే పద్య ఖండికను పద్య కవిత రూపంలో పంపించాను.దానికి రాష్ట్ర స్తాయి పద్య కవితలపోటిలో ప్రధమ బహుమతి లభించినట్లు తెలిపారు.ఆ కార్యక్రమం "ఒంగోలు"లో ఏర్పాటు చేశారు.24/11/2012న ఆ బహుమతి అందుకోవడానికి మరియు అదే రోజు కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడానికి రేపు రాత్రి బయలుదేరుతున్నాను.మీ ఆశీర్వాదములు కోరుతున్నాను.
ఆ పద్యాలను ఇక్కడ మన అంతర్జాల వీక్షలకు కూడా అందజేస్తున్నాను. ఇట్లు మీ సోమార్క
తేనియలూటలూరు,తియ తియ్యని దేశిపదాల సౌరు,స
ద్గాన గుణమ్ము,తెల్గు నుడికారగణమ్ములనొప్పు,వాక్యవి
న్నాణములున్,మనోజ్ఞ కవనమ్ముకు పెట్టని సొమ్ములౌనుగా,
జానుతెనుంగుపద్యముల జాతికి సాటికవిత్వమున్నదే?
పదముల్ పేర్చి,బిగించికూర్చి,రసవద్భావమ్ములన్ పేర్చి,సొం
పొదవన్, శైలియు,వృత్తి,రీతి,రసవత్పాకాది,మేలౌ గుణా
భ్యుదయోల్లాస, కవిత్వ రూప నిగమ ప్రోక్తార్ష విజ్ఞాన సం
పదయై భాసిలు,తెల్గు భాషకు,మహద్భాగ్యంబు!పద్యంబెగా! 
నన్నయనాటి నుండి,యధునాతన రీతులు నేర్చుకొంచు,నె
న్నెన్నొ కవిత్వ ప్రక్రియలనింపగు,రూపుల దిద్దుకొంచు,న
భ్యున్నతిగొంచు,కావ్యవిభవోజ్వలమౌచును,తెల్గుసాహితిన్
యెన్నగ!హృద్య పద్యమది!యింపగు!తెల్గు సమృద్ధినందగన్.
పద్యము ప్రాతవడ్డదని,భావన సేయుటయేమొ గాని?!త
ద్విద్య సహస్ర రూపిణిగ,విస్తృత రూపము దాల్చియొప్పె,న
య్యద్యతనాంధ్రసత్కవులు,యాధునికత్వ,కవిత్వరూపమౌ,
హృద్య కవిత్వ రీతులకు,నింపగు మూలము!గాదనందురే?
సరస పద ప్రహేళికల జల్లిన భావరజమ్ముతో,నలం
కరణలనొప్పు వర్ణనల గప్పిన,యక్షర రధ్యపైని,మా
సరస కవీశు లందముగ,చక్కని పద్య రధమ్ము గూర్చిరా
దరమున,త్రిప్పినారలు!వధాన విధాన పధాన నెల్లెడన్.
నన్నయ సంస్కృతాంధ్ర సుగుణమ్ములనొద్దికదిద్దితీర్చి,వి
ద్వన్నుతుడయ్యె;నూతన విధానము నేర్పెను సోమయాజి,రూ
పోన్నతిజేసె,దేశికవితోద్యమసారధి;సోముడున్ పదా
ర్వన్నెల శొభగూర్పగను!పద్యము జానగు శోభ నొప్పెడిన్.
చింతింపంబనిలేదు!పద్యకవు లక్షీణ ప్రభావోన్నతిన్,
గొంతుల్విప్పుడు!పూర్వ వైభవము సంకోచమ్ముగా బొంద,మీ
వంతున్ సత్కృషిసల్ప,మేటి రసవత్పద్యమ్మనావద్యమై,
భ్రాంతుల్ దీర,రసజ్ఞశ్రోతృ జలధిన్ పర్వించు పద్యాపగల్.
డా.చంద్రశేఖరావధాని చేస్తున్న అష్టావధానంలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సోమార్క..
చూచాము కదండి! ఈ సాహితీ ప్రయాణంలో శ్రీ సోమార్కగారు మరిన్ని విజయ బావుటాలెగరవేయాలని కోరుతూ వారిని ఆంధ్రామృతం ద్వారా మరొక్క పర్యాయము అభినందిస్తున్నాను. ఇక 
ఈ అంశముపై మీరూ మీ భావలకు పద్య రూపాన్ని కల్పించి ఆంధ్రామృత్ం ద్వారాపాఠకులకు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.

Wednesday, November 21, 2012

మియాపూర్ హైస్కూల్లో25-11-2012న కవిసమ్మేళనమునకు ఆహ్వానము

జైశ్రీరామ్.
సాహితీ సన్మిత్రులారా! సాహితీ సమితి శేర్లింగంపల్లి శాఖ వారు వివిధ ప్రాంతములనుండి అనేకమంది కవులను ఆహ్వానించి, కవిసమ్మేళనము ఏర్పాటు చేసియున్నారు. సహృదయులందరూ ఈ కార్యక్రమమునకు  అహ్వానితులే.
మియాపూర్ లోగల ఈసేవా కేంద్రము ప్రక్కనే గల జిల్లాపరిషత్ హైస్కూల్ లో ఈ కార్యక్రమము జరుగుచున్నది. మియాపూర్ చౌరాస్తాకు, ఆల్విన్ చౌరాస్తాకు మధ్యగల ష్టాప్.రోడ్డుకు ఉత్తరంగా ఉన్న సందులో ఈ పాఠశాల కలదు.
జైహింద్.

Tuesday, November 6, 2012

తిరుమలేశుని తన హరికథా గానంతో ఓలలాడించిన హరికథా భాగవతార్ బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ ఈ నెల 2౦ వ తేదీన మన హైదరాబాదు వస్తున్నారు.

జైశ్రీరామ్.
భగవద్భక్తులారా! మొన్న గడిచిన తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో మూడు రోజుల పాటు తన హరి కథా గానంతో  జనాన్ని భక్తి పారవ్శ్యంలో ముంచెత్తి, ఆ వేంకటేశ్వర స్వామి వారికి సహితం ఆనంద పారవశ్యం కలిగించిన బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ మూర్తి భాగవతార్ (బొబ్బిలి)  మన భాగ్యనగరం తే.20 ని వస్తున్నారు. 23వ తేదీన వారి హరికథ ఉన్నది. 
20, 21, 22 తేదీలలో వారు మన భాగ్యనగరంలోనే ఉంటున్నందున ఎవరయినా వీరి హరికథా కార్యక్రమం పెట్టదలచుకొంటే ఇది ఒక మంచి అవకాశం.
23 వతేదీన పుట్టపర్తి సాయిబాబా వారి జయంతి సందర్భంగా 19 వతేదీ నుండి23వ తేదీ వరకు భక్తి కార్యక్రమాలు సాయి భక్తులు నిర్వహించుట పరిపాటి. అందుచే్ ఈ అవకాశం కోసం ఎదురు చూచేవారుంటారని భావించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.
వారిని సంప్రదించ దలచుకొన్నవారి కొఱకు వారి సెల్ నెంబరు తెలియ జేస్తున్నాను.
వారి సెల్ నెంబరు 9014992816.
జైహింద్.